ఉప్పొంగిన వరద కాలువ
ABN, First Publish Date - 2022-07-14T07:21:09+05:30
గతంలో ఎన్నడూ లేని విధంగా వరదకాలువ ప్రమాదకరంగా పొంగి పొర్లింది.
= 25 వేల క్యూసెక్కుల ప్రవాహం
మల్యాల, జూలై 13: గతంలో ఎన్నడూ లేని విధంగా వరదకాలువ ప్రమాదకరంగా పొంగి పొర్లింది. ఎస్సారెస్పీ నుంచి మంగళవారం 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా బుధవారం ఉదయం ఐదువేల క్యూసెక్కులకు తగ్గించారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షంతో జగ్గాసాగర్ వద్ద పెద్ద వాగు నుంచి దాదాపుగా 15వేల క్యూసె క్కుల వరకు, కాలువ వెంట గల వాగులు, ఒర్రెలు, చెరువు కాలువల నీరు సుమారు ఐదువేల క్యూసెక్కుల వరకు వరద కాలువలోకి రావ డంతో మల్యాల మండలం రామన్నపేట శివారులో వరదకాలువ నీరు కాలువకిరివైపులా పొంగి ప్రవహించాయి. వరదకాలువ సామర్థ్యం మేరకు అధికారులు ఇంతవరకు 22వేల క్యూసెక్కుల వరకు మాత్రమే నీటిని విడుదల చేసిన సందర్భాలు ఉండగా పెద్దవాగు నీటితో కలిపి 25వేల క్యూసెక్కుల వరకు కాలువలోకి ప్రవహించడంతో వరదకాలువలో నీరు ప్రమాదకరంగా ప్రవహించింది. రామన్నపేట వద్ద గల వంతెనలను ఆనుకొని కాలువ పొంగి ప్రవహించగా నూకపెల్లి, గొల్లపల్లె శివారులో గతంలో నుంచి వరదకాలువకు ఉన్న కాలువల నుంచి వరద నీరు బయటకు ప్రవహించాయి. నూకపెల్లిలో గ్రామం లోకి కొంత మేర రావడంతో ఇళ్లల్లోకి నీరు చేరాయి. వరదకాలువ మొదటి సారి ఉగ్రరూపంలో ప్రవహించడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తూము ద్వారా పోతారం చెరువులోకి కొంత మేర నీటిని మళ్లించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రామన్నపేట వద్ద ప్రమాదకరంగా మారిన వరదకాలువ ప్రవాహాన్ని పరిశీలించారు. ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలను అధికారులు బుధవారం మధ్యా హ్నం వరకే నిలిపివేశారు. బుధవారం రాత్రి వరకు కొంత మేర నీటి ప్రవాహం వరదకాలువలో తగ్గింది.
Updated Date - 2022-07-14T07:21:09+05:30 IST