హనుమాన్ శోభాయాత్ర నేడు
ABN, First Publish Date - 2022-04-16T14:02:28+05:30
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించే శోభాయాత్రకు నగరం సిద్ధమైంది. శోభాయాత్ర సందర్భంగా నగరంలో
ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ సిటీ: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించే శోభాయాత్రకు నగరం సిద్ధమైంది. శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బందోబస్తు విధుల్లో 8 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉదయం 11.30కు గౌలిగూడ రామాలయం నుంచి ప్రారంభమయ్యే ప్రధాన యాత్ర రాత్రి 8 వరకు తాడ్బండ్ ఆంజనేయ స్వామి మందిరానికి చేరుకుంటుంది. కర్మన్ఘాట్ హనుమాన్ మందిరం నుంచి ప్రారంభం అయ్యే మరో యాత్ర నారాయణగూడ మీదుగా ప్రధాన యాత్రలో కలిసి తాడ్బండ్ చేరుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ప్రారంభమయ్యే మరో యాత్ర కూడా మార్గమధ్యలో ప్రధాన యాత్రలో కలుస్తుంది.
ఉదయం 9 నుంచి 2 వరకు
లక్డీకాపూల్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వాహనదారులు బషీర్బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణగూడ ఫ్లై ఓవర్, బర్కత్పురా, ఫీవర్ ఆస్పత్రి, తిలక్నగర్, ఛే నెంబర్, అలీకేఫ్ క్రాస్రోడ్, మూసారం బాగ్మీదుగా వెళ్లాలి.
దిల్సుఖ్నగర్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వారు ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ మీదుగా లేదా ఎల్బీనగర్, ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
మధ్యాహ్నం 2 నుంచి 7 వరకు
లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్, ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, ప్యారడైజ్, జేబీఎస్ లేదా సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఏదైనా సమస్య వస్తే సంప్రదించేందుకు 040- 27852482 (ప్రత్యేక కంట్రోల్ రూం నెంబర్), 9010203626 (హెల్ప్లైన్ నెంబర్) అందుబాటులోకి తెచ్చారు.
హనుమాన్ దేవాలయంలో సీపీ పూజలు
బోయినపల్లి: తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయంలో సీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2022-04-16T14:02:28+05:30 IST