సకల జనుల ఉద్యమంతో తెలంగాణ సాధించాం
ABN, First Publish Date - 2022-06-03T09:32:48+05:30
కల్లూరు/పెనుబల్లి రూరల్, జూన్ 2: ‘‘సకల జనులు ఒక్కతాటిపై కలిసి చేసిన ఉద్యమం, అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కానీ
ప్రజల ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు: షర్మిల
కల్లూరు/పెనుబల్లి రూరల్, జూన్ 2: ‘‘సకల జనులు ఒక్కతాటిపై కలిసి చేసిన ఉద్యమం, అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కానీ ప్రజల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారు’’ అని వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగిస్తున్న ఆమె గురువారం పెనుబల్లి, కల్లూరు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కల్లూరులో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారుడని రెండు సార్లు కేసీఆర్ను సీఎంను చేస్తే తెలంగాణ ప్రజల బతుకులు ఏమాత్రం మారలేదని మండిపడ్డారు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ పడిపోతున్న ప్రతీసారి ఉద్యమాన్ని కేసీఆర్ వాడుకున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఉద్యమమే కేసీఆర్ను నిలబెట్టి ముఖ్యమంత్రిని చేసింది. తెలంగాణ కోసం 1200 మంది బలిదానం చేస్తే, ఎంతమందిని ఆదుకున్నారు? రాష్ట్రం కోసం పోరాడి ఎంతో మంది రోడ్డున పడ్డారు. పదవులు కేసీఆర్ కుటుంబం అనుభవిస్తోంది. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి ఓటమిపాలయ్యే సీటు ఇచ్చారు. కేసీఆర్ బిడ్డ కవిత ఒడిపోయినా పోటీలేని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అదే పదవిని శ్రీకాంతాచారి తల్లికి ఇవ్వవచ్చు కదా’’ అని షర్మిల అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పెనుబల్లి మండలం తాళ్లపెంటలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం సాయంత్రం కల్లూరుకు చేరింది. ఇప్పటి వరకు యాత్ర 1082 కిలోమీటర్లు పూర్తయ్యింది. గురువారం రాత్రి కల్లూరులో బస చేసిన షర్మిల.. శుక్రవారం ఉదయం కల్లూరు మండలంలోని గనియాతాండ, హనుమతాండ, పాయాపూరు, తల్లాడ మండలంలోని రంగంబంజరు, బిల్లుపాడు మీదుగా పాదయాత్ర కొనసాగించనున్నారు.
Updated Date - 2022-06-03T09:32:48+05:30 IST