మునుగోడులో జరిగింది నోట్ల ఎన్నిక
ABN, First Publish Date - 2022-11-08T04:42:13+05:30
మునుగోడులో జరిగింది ఉప ఎన్నిక కాదని..
రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని చంపేశాయి
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నోటీసులు ఇచ్చాం
సమాధానం రాకుంటే చర్యలు తప్పవు: జైరాం రమేశ్
కామారెడ్డి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో జరిగింది ఉప ఎన్నిక కాదని.. నోట్ల ఎన్నిక అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్.. ప్రజాస్వామ్యాన్ని చంపి మద్యం, ధనంతో ఓట్లను కొనుగోలు చేశాయని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉప ఎన్నిక కోసం కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం షేకాపూర్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఫలితంతో కాంగ్రె్సకు ఎలాంటి నష్టం లేదని, తమ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి ధన బలం ఉన్న ఇద్దరు అభ్యర్థులపై పోటాపోటీగా పోరాడారని ప్రశంసించారు. మునుగోడులో ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకుంటామని వెల్లడించారు. ఉప ఎన్నిక జరిగిన తీరుపై ఎన్నికల కమిషన్ సమీక్షించాలని సూచించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యవహార శైలిపై టీపీసీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పార్టీ అధిష్ఠానం నోటీసులు జారీ చేసిందని, గడువులోగా సమాధానం రాని పక్షంలో తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండబోతుందని అన్నారు. తెలంగాణలోని 8 జిల్లాల పరిధిలో 12రోజుల పాటు 330 కి.మీ మేర రాహుల్ పాదయాత్ర చేయగా, అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబానికి తప్ప.. తెలంగాణ సమాజానికి ఎలాంటి మేలు జరగలేదని దుయ్యబట్టారు.
Updated Date - 2022-11-08T04:43:44+05:30 IST