RTC సంక్రాంతి ఆఫర్.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త..
ABN, First Publish Date - 2022-01-07T14:26:46+05:30
RTC సంక్రాంతి ఆఫర్.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త...
- స్వగ్రామాలకు సర్వీసులు
- పండుగకు 4,318 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ సిటీ/చాదర్ఘాట్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 4,318 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగరంలో నివాసముంటున్న అనేకమంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈనెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు.
రోజూ నడిపే బస్సులకు అదనంగా ప్రయాణికుల డిమాండ్ మేరకు జంటనగరాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,334 ప్రత్యేక బస్సులను, ఏపీలోని వివిధ ప్రాంతాలకు 984 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఈ బస్సులు మహాత్మాగాంధీ బస్స్టేషన్, జూబ్లీ బస్స్టేషన్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్రోడ్, ఎల్బీనగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్బీ, ఎస్ఆర్నగర్, అమీర్పేట, టెలిఫోన్ భవన్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లతో పాటు శివారు కాలనీల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎం వివరించారు. వీటి పర్యవేక్షణ కోసం 200 మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్టు చెప్పారు.
తెలంగాణలో..
సంక్రాంతి ప్రత్యేక బస్సులు తెలంగాణలో నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట లాంటి పట్టణాలకు నడవనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామర్రు, పొదిలి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.
కొన్ని పాయింట్ల నుంచి నేరుగా ఏపీకి బస్సులు..
ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 7 నుంచి 14 వరకు నగరంలోని బీహెచ్ఈల్, మియాపూర్, కేపీహెచ్బీ, దిల్సుఖ్నగర్, ఈసీఐఎల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశారు.
నామమాత్రపు చార్జీలతో బస్సులు
సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నామమాత్రపు టికెట్ల ధరతో ప్రత్యేక బస్సులు కల్పిస్తామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వీ.వెంకటేశ్వర్లు తెలిపారు. 18 మంది ఉంటే నేరుగా వారి వద్దకే బస్సు పంపుతామని చెప్పారు. ఏసీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని, వివరాలకు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ 99592-26117 సంప్రదించాలని సూచించారు.
Updated Date - 2022-01-07T14:26:46+05:30 IST