Revanth Reddy: ప్రభుత్వ నిర్లక్షమే ఇంతటి విపత్తులకు కారణం..
ABN, First Publish Date - 2022-09-13T17:04:03+05:30
సికింద్రాబాద్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident)లో మరణించిన వారికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏడుగురు దుర్మరణం పాలయ్యారన్నారు. గతంలో హైదరాబాద్లో అనేక అగ్ని ప్రమాదలు జరిగి ప్రజల ప్రాణాలు బలి అవుతున్న ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్షమే ఇంతటి విపత్తులకు కారణమన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లాంటి మహా నగరంలో ప్రభుత్వం నియమ నిబంధనలు కఠినంగా అలు చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గతంలో ఇదే సికింద్రాబాద్లోని ఇనుము తుక్కు గోడౌన్లో కూడా ఇలాంటి ప్రమాదం జరిగి ప్రజల ప్రాణాలు పోయాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలని కోరారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-09-13T17:04:03+05:30 IST