Hyderabad : వివాదంలో మరో పబ్.. సీసీ కెమెరాలను పరిశీలించగా..
ABN, First Publish Date - 2022-04-25T14:59:27+05:30
వివాదంలో మరో పబ్.. సీసీ కెమెరాలను పరిశీలించగా..
- కస్టమర్ను కొట్టిన సెక్యూరిటీ సిబ్బంది
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : పొగ తాగినందుకు పబ్ సెక్యూరిటీ సిబ్బంది తనను తీవ్రంగా గాయపరిచారని ఓ యువకుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిజమ్ పబ్లో శనివారం రాత్రి వివాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే నందకిశోర్ శనివారం రాత్రి ప్రిజమ్ పబ్కు వెళ్లాడు. అందులో స్మోకింగ్ జోన్ ప్రత్యేకంగా ఉందన్న విషయం తెలియక, డైనింగ్ టేబుళ్ల పక్కనే పొగతాగుతున్నాడు. హెచ్చరికలు చేయకుండానే సెక్యూరిటీ సిబ్బంది తనపై దాడి చేశారని నందకిశోర్ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పొగ తాగినంత మాత్రాన దారుణంగా కొడతారా..? అని వాపోయారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించి సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
చెప్పినా వినలేదు..
ఈ ఘటనపై పబ్ సెక్యూరిటీ ఇన్చార్జి సదన్ నాయుడు మాట్లాడుతూ తనపైనే దాడి జరిగిందని చెప్పారు. నందకిశోర్ తదితరులు పబ్లోకి ఎంటర్ అయినప్పుడే నిబంధనలు చెప్పామని, స్మోకింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు ఉందని చెప్పినా కస్టమర్ల మధ్యలో స్మోక్ చేస్తుంటే వద్దని రిక్వెస్ట్ చేశామని అన్నారు. వినకుండా తనపై దాడికి దిగారని, షర్టు చింపేశారని చెప్పారు.
ఇద్దరూ ఫిర్యాదు చేశారు..
ఎస్ఐ సురేందర్రెడ్డి, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన నందకిషోర్ మిత్రులతో కలిసి శనివారం రాత్రి ప్రిజమ్ పబ్కు వెళ్లారు. నో స్మోకింగ్ జోన్లో స్నేహితులతో సిగరెట్ తాగుతున్నారు. దీంతో కొంతమంది కస్టమర్లు సెక్యూరిటీ సిబ్బందికి, నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని బయటకు పంపే ప్రయత్నంలో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించామని, విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు.
Updated Date - 2022-04-25T14:59:27+05:30 IST