‘ప్రేమికుల దినోత్సవం’ నాడు కానరాని Lovers సందడి..
ABN, First Publish Date - 2022-02-15T12:01:46+05:30
మోరల్ పోలీసింగ్, కరోనా, ఇంట్లో వాళ్ల నిఘా తదితర భయాలతో భాగ్యనగరిలో
హైదరాబాద్ సిటీ : మోరల్ పోలీసింగ్, కరోనా, ఇంట్లో వాళ్ల నిఘా తదితర భయాలతో భాగ్యనగరిలో ప్రేమపక్షుల కువకువలు ప్రేమికుల దినోత్సవం రోజున పెద్దగా కనిపించలేదు. కాకపోతే కొంతమంది ప్రేమికులు నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్లపై ముందురోజు రాత్రి కేక్లు కట్ చేసుకుని ఎంజాయ్ చేయడం నగరంలో ఈసారి కనిపించిన నయా ధోరణి.
ప్రేమ ముందే పుట్టింది..
ప్రేమను వ్యక్తీకరించడానికి ఓ రోజు అవసరమా.. అన్న ప్రశ్న కొందరిలో తలెత్తుతోంది. మనది కాని సంస్కృతిని మనం అలవాటు చేసుకున్నాం. కానీ మోరల్ పోలీసింగ్ తరువాత కూడా దానినే పట్టుకుని వేలాడటం ఎందుకు? అందుకే తమ సెలబ్రేషన్స్ ముందే ముగిసాయన్నారు ఓ పీఆర్ ఏజెన్సీలో చేస్తోన్న అనుకృతి (పేరు మార్పు). ప్రేమికుల రోజున కలవాలని ఉన్నా లేనిపోని సమస్యలెందుకుని ఎవరింట్లో వాళ్లే ఉన్నామని, ఈ వీకెండ్ కలవడానికి ప్లాన్ చేసుకున్నామని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆదిత్య తెలిపాడు.
నిజానికి ఇప్పుడు వాలెంటైన్స్డేను ఎక్కువగా జరుపుకుంటున్నది ప్రేమలో ఉన్నవారు కాదని, ఇప్పటికే వివాహబంధంతో ఒకటైన వారేనన్నారు నగరంలోని ఓ స్టార్ హోటల్ ఎఫ్ అండ్ బీ మేనేజర్. ఫుట్ఫాల్ పెద్దగా లేకపోవడం వల్ల ఈసారి క్యాండిల్ లైట్ డిన్నర్ప్లాన్ చేయలేదని తెలిపారు.
ప్రేమ తీరు మారింది..!
పబ్లు, హోటల్స్లో కూడా పెద్దగా వేడుకలేవీ కనిపించలేదు. దానికి తోడు సోమవారం కావడంతో పబ్ల్లో సందడి లేదని చెప్పారు నిర్వాహకులు. డిజిటల్ యుగంలో మాస్కుల మాటున ముద్దులకు బదులుగా ఎమోజీలు వ్యక్త పరచడమే ప్రస్తుతానికి అనుసరణీయ విధానమని కొంతమంది యువత పేర్కొంటున్నారు. అయితే, అందరూ ఇదే రీతిలో ఆలోచించడం లేదు.
నెక్లెస్రోడ్డులో వాలెంటైన్ డే ఉత్సవం..
వాలెంటైన్ డేను పురస్కరించుకుని సోమవారం నెక్లెస్ రోడ్డులో క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్బంగా సమితి అధ్యక్షులు జెరుసలేం మత్తయ్య మాట్లాడుతూ కొంతమంది ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ పార్కుల్లోకి ప్రేమికులు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనే అవుతుందని, మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు.
నిర్మానుష్యంగా ఇందిరాపార్కు
వాలెంటైన్స్ డే సందర్భంగా నగరంలో ప్రఖ్యాతి గాంచిన ఇందిరాపార్కు వెలవెలబోయింది. కొన్ని సంస్థలు ప్రేమ జంటలకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం పదిగంటల నుంచే ఇందిరాపార్కును గాంధీనగర్ పోలీసులు పూర్తిగా మూసివేశారు. రెండు ప్రధాన గేట్లకు తాళాలు వేసి ప్రేమ జంటలు ఎవరూ రాకుండా బందోబస్తును ఏర్పాటుచేశారు.
Updated Date - 2022-02-15T12:01:46+05:30 IST