Hyd: బీజేపీ నేతలపై పరువు నష్ట దావా వేయనున్న కవిత
ABN, First Publish Date - 2022-08-22T20:24:41+05:30
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ...
హైదరాబాద్ (Hyderabad): ఢిల్లీ మద్యం పాలసీ (Liquor Policy) కుంభకోణానికి సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను ఢిల్లీ బీజేపీ (BJP) నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) పరువు నష్ట దావా వేయనున్నారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్ట దావా వేయనున్నారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా కోర్టును అశ్రయించనున్నారు. ఇప్పటికే కవిత న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి ఆదివారం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పైన, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితపైన నేరుగా ఆరోపణలు చేశారు. ఇందులో కవిత భర్త తరఫు బంధువుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మరికొన్ని వివరాలను బయటపెట్టాయి. ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని.. మద్యం వ్యాపారంలో కమీషన్ల కోసమే ఆమె ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నారని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ఈ మేరకు.. ఢిల్లీ (వెస్ట్) ఎంపీ, బీజేపీ నేత పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మద్యం కుంభకోణంపై మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని.. ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలకు వారు కూడా హాజరయ్యారని.. తొలుత మాట్లాడిన పర్వేశ్ వర్మ ఆరోపించారు.
Updated Date - 2022-08-22T20:24:41+05:30 IST