ప్రియురాలి భర్త హత్యకు సుపారీ.. వాట్సప్ మెసేజ్ పెట్టి..!!
ABN, First Publish Date - 2022-03-22T14:46:48+05:30
ప్రియురాలి భర్త హత్యకు సుపారీ.. వాట్సప్ మెసేజ్ పెట్టి..!!
- భార్యతో సహా ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్ సిటీ/కొత్తపేట : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న ప్రియురాలి భర్త హత్యకు సుపారీ అందజేశాడు. ఇంతలో ఆమె ఇంటి నుంచి అదృశ్యం కావడం, భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. ఈ కేసులో ముగ్గురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్హెచ్ఓ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన దంపతులు మన్సూరాబాద్ మధురానగర్లో ఉంటున్నారు. భర్త స్వగ్రామంలో మీ సేవా కేంద్రంతో పాటు, ఇసుక వ్యాపారం చేసేవాడు. నర్రి వెంకటేష్ ఇసుక సరఫరా చేసేవాడు. సొంతంగా లారీలు ఉన్నాయి. వెంకటేష్కు దంపతుల్లోని భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది గుర్తించిన ఆమె భర్త సమీపంలోని సరస్వతీనగర్కు కుటుంబాన్ని మార్చాడు. అయినా, వారు సంబంధం కొనసాగిస్తుండడంతో ఆమెను భర్త మందలించాడు. దీంతో ఆమె ప్రియుడు వెంకటేష్కు విషయం తెలిపింది.
అనంతరం తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని ఈ నెల 16న భర్తకు వాట్సప్ మెసేజ్ పెట్టి వెళ్లిపోయింది. ఆమె కోసం వెదికిన భర్త ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య అదృశ్యం వెనుక నర్రి వెంకటేష్ హస్తం ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు వెంకటేష్ మన్సూరాబాద్ వాంబే కాలనీలో ఉండే నవీన్కు రూ 5 లక్షలు సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు. నవీన్ మన్సూరాబాద్లో ఉండే నల్లగొండ వాసి రాజేష్కు హత్య నిమిత్తం ఆ డబ్బు అందజేశాడు. ఇలా మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. హత్యకు కుట్ర పన్నిన వెంకటేష్ను, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. సుపారీ విషయం నిర్ధారణ కావడంతో నవీన్ను కూడా అరెస్ట్ చేశారు. రాజేష్ పరారీలో ఉన్నాడు.
Updated Date - 2022-03-22T14:46:48+05:30 IST