Khairatabad Maha Ganesh: శోభాయాత్రకు సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణేష్
ABN, First Publish Date - 2022-09-08T16:27:05+05:30
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు సిద్ధమవుతున్నాడు. రేపటి శోభాయాత్ర కోసం ఖైరతాబాద్ ఉత్సవ నిర్వహకులు ఏర్పాట్లు ప్రారంభించారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad maha ganesh) శోభాయాత్రకు సిద్ధమవుతున్నాడు. రేపటి శోభాయాత్ర కోసం ఖైరతాబాద్ ఉత్సవ నిర్వహకులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఒకరోజు ముందుగానే మండపం షెడ్డును తొలగించారు. మట్టి గణపతి కావడంతో నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రక్ వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మరోవైపు చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు ఖైరతాబాద్కు తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి.
తొలగిన వివాదం....
కాగా... హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనంపై వివాదం తొలగింది. రేపటి గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్పై జీహెచ్ఎంసీ భారీగా ఏర్పాట్లు చేయనుంది. ట్యాంక్ బండ్పై 15 క్రేన్లు.. ఎన్టీఆర్ మార్గ్లో 9.. పీవీ మార్గ్లో 8 క్రేన్లను ఏర్పాటు చేయనుంది. గ్రేటర్లో 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. హుస్సేన్ సాగర్లో మట్టి గణపతితో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లభించింది. అలాగే 74 ప్రాంతాల్లో బేబీ పౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జన విధుల్లో దాదాపు 10 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొననుంది. నిమజ్జనాల పర్యవేక్షణకు 168 మందితో బల్దియా అధికారుల బృందం సిద్ధమైంది.
Updated Date - 2022-09-08T16:27:05+05:30 IST