HYD : పని మనుషులు లిఫ్టు వాడితే జరిమానా.. KTR సార్ ఏంటిది..!
ABN, First Publish Date - 2022-01-15T12:02:04+05:30
పని మనుషులు లిఫ్టు వాడితే జరిమానా.. KTR సార్ ఏంటిది..!
- హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో నోటీస్
- కొవిడ్ నేపథ్యంలోనే అంటోన్న అపార్ట్మెంట్ వాసులు
హైదరాబాద్ సిటీ : నగరంలోని ఓ అపార్ట్మెంట్లో పని మనుషులు, డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ లిఫ్టు ఉపయోగిస్తే రూ.300 జరిమానా విధిస్తామని ఏర్పాటుచేసిన నోటీస్ చర్చనీయాంశమైంది. అపార్ట్మెంట్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పని మనిషులు వంటింట్లో పని చేయొచ్చు..? లిఫ్టుల్లో ఎక్కకూడదా..? అని ఒకరు ప్రశ్నించారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఇలాంటి విషయాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ఈ విషయంపై స్పందించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించాలని వారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో అక్కడి ఫ్లాట్స్లో ఉండే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. దీనిపై అపార్ట్మెంట్ అసోసియేషన్లు మాత్రం.. మహమ్మారి భయం వల్ల ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అదనంగా సర్వీస్ లిఫ్ట్ (పని మనుషులు, ఇతరుల కోసం) ఏర్పాటు చేయాల్సి వస్తుందేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని అపార్ట్మెంట్లలో వృద్ధులు, పిల్లలకు ఒక లిఫ్టు, ఇతరుల కోసం మరో లిఫ్టు వాడుతున్నట్టు చెబుతున్నారు.
Updated Date - 2022-01-15T12:02:04+05:30 IST