భయం.. భయం.. ముంపు తప్పదా.. అయ్యప్పా.. ఖాళీ చేసేస్తున్నారు..!
ABN, First Publish Date - 2022-06-02T16:43:43+05:30
భయం.. భయం.. ముంపు తప్పదా.. అయ్యప్పా.. ఖాళీ చేసేస్తున్నారు..!
- వర్షం లేకున్నా ఇళ్లల్లోకి నీరు
- చెరువు నీటి మట్టం పెరిగి వరదలా?
- ఖాళీ చేసి వెళ్తున్న స్థానికులు
వర్షం లేదు.. అయినప్పటికీ మంగళవారం రాత్రి ఆ కాలనీలోని ఇళ్లు నీట మునిగాయి. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా మునిగే కాలనీలో ప్రస్తుతం వర్షం లేకపోయినా అకస్మాత్తుగా ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కొందరు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. బండ్లగూడ చెరువుకు పై భాగంలో ఉన్న అయ్యప్ప కాలనీలో పరిస్థితి ఇది.
హైదరాబాద్ సిటీ/మన్సూరాబాద్ : వర్షాలు (Rains) కురిసినప్పుడల్లా నాగోలు డివిజన్ అయ్యప్ప కాలనీని వరద ముంచెత్తుతుంది. దీనికి పరిష్కారంగా భారీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణాన్ని ఎస్ఎన్డీపీ ద్వారా చేపడుతున్నారు. సుమారు రూ.37 కోట్ల వ్యయంతో చెరువు అలుగు ప్రాంతం నుంచి ఈ డ్రెయిన్ నిర్మిస్తున్నారు. చెరువు తూము నుంచి నీరు కిందికి వెళ్లే చోట మ్యాన్హోల్ దెబ్బతినడంతో మరమ్మతు పనులను కూ డా చేపడుతున్నారు. మూడు రోజులుగా చె రువు నుంచి నీరు కిందకు వెళ్లకుండా ఆపారు. నీటి మట్టం పెరిగి నీరు ఉప్పొం గింది. దీంతో చెరువు వెనుక ఉన్న అయ్యప్ప కాలనీలోకి నీరు చేరింది. స్థానికులకు మళ్లీ ముంపు భయం పట్టుకుంది. ఏ చిన్నపాటి వర్షం వచ్చినా ప్రమాదమని భావించి పలువురు ఇళ్లను ఖాళీ చేస్తున్నారు.
రెండేళ్లుగా..
వరుసగా రెండేళ్లు ముంపును కళ్లారా చూసిన స్థానికులను భయం వీడలేదు. ఇప్పుడు వర్షాలు కురవకముందే సుమారు 20 ఇళ్లలోకి నీరు చేరింది. భారీ వర్షాలు కురిస్తే మళ్లీ ముంపు తప్పదని కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మంగళ, బుధవారాల్లో పలు కుటుంబాలు కాలనీని వీడాయి. బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో స్థానికుల్లో వరద ముంపు భయాలు పోవడం లేదు.
మ్యాన్హోల్ మరమ్మతే కారణం..
చెరువు కింద దెబ్బతిన్న మ్యాన్హోల్ రిపేర్ను మూడు రోజుల కిందట చేపట్టారు. మ్యాన్హోల్ గట్టిపడేందుకు మూడు రోజులుగా చెరువు నీరు కిందకు వెళ్లకుండా ఆపాం. ఈ కారణంగానే చెరువు నీటి మట్టం పెరిగి కాలనీల్లోకి నీరు వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం నీటిని కిందకు వదిలాం. అయ్యప్ప కాలనీవాసులకు సమస్య ఉండదు. - పవన్, డీఈ, ఇరిగేషన్
Updated Date - 2022-06-02T16:43:43+05:30 IST