Delhi: తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై కేంద్రానికి వివరించిన Kishan Reddy
ABN, First Publish Date - 2022-07-18T19:46:55+05:30
గోదావరి నదికి వచ్చిన వరదల వలన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజలకు జరిగిన నష్టం...
న్యూఢిల్లీ (Delhi): గోదావరి (Godavari) నదికి వచ్చిన వరదల వలన తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాలలో ప్రజలకు, వారి జీవనోపాధికి జరిగిన నష్టం గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)ని కలిసి వివరించారు. దీనిపై స్పందించిన అమిత్ షా.. ఆయా ప్రాంతాలలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వీలయినంత త్వరగా అందించమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో అవసరమైన రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లను నిర్వర్తించడానికి ఇప్పటికే 13 ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను పంపించడం జరిగిందని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ (SDRF) నిధులను కేటాయించినప్పటికీ, మొదటి విడత నిధులను విడుదల చేయడానికి అవసరమైన విజ్ఞాపణ పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ అందించలేదన్నారు. ఈ పత్రాలను పంపించిన వెంటనే అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మొదటి విడత నిధులను ఎన్డీఆర్ఎఫ్ (NDRF) నుంచి ఇప్పటికే విడుదల చేయడం జరిగిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన వెంటనే రెండో విడత నిధులకు సంబంధించిన కేటాయింపులు జరిపి, నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రాథమిక నివేదిక అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వ బృందాలను పంపి జరిగిన నష్టం అంచనా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది.
Updated Date - 2022-07-18T19:46:55+05:30 IST