రిపబ్లిక్ డే రోజున సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు: ఈటల
ABN, First Publish Date - 2022-01-26T20:35:42+05:30
ఉద్దేశపూర్వకంగానే సీఎం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.
హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగానే సీఎం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లలేదని, రాజ్భవన్-ప్రగతిభవన్కు మధ్య దూరం ప్రజలకు క్షేమం కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనకుండా ముఖ్యమంత్రి సంప్రదాయాలను తుంగలో తొక్కారని విమర్శించారు. గవర్నర్ ఎవరైనా ఉండొచ్చు.. గవర్నర్ కుర్చీకి గౌరవం ఇవ్వాలన్నారు. రిపబ్లిక్ డే రోజున సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. రాజ్భవన్లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకాలేకపోతే కనీసం సీనియర్ మంత్రినైనా పంపించి ఉండాల్సిందని ఈటల అభిప్రాయపడ్డారు.
పోచారం స్పీకర్ కుర్చీకే మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతున్నారని ఈటల మండిపడ్డారు. స్పీకర్ హోదాలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారని, శాంతి భద్రతలు కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారని విమర్శించారు. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుంటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని, ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ అన్న విషయం టీఆర్ఎస్ గుర్తుంచుకోవాలని ఈటల రాజేందర్ అన్నారు.
Updated Date - 2022-01-26T20:35:42+05:30 IST