ఆ డబ్బు గురించి నాకు తెలియదు సర్..
ABN, First Publish Date - 2022-01-29T17:40:51+05:30
‘సంతోష్ సర్.. మన ఆఫీసులో కనిపించకుండా పోయిన రెండు లక్షల రూపాయల గురించి నాకు తెలియదు. ఇప్పుడు కట్టమంటే
దొంగతనం నింద పడిందని ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్/బంజారాహిల్స్: ‘సంతోష్ సర్.. మన ఆఫీసులో కనిపించకుండా పోయిన రెండు లక్షల రూపాయల గురించి నాకు తెలియదు. ఇప్పుడు కట్టమంటే ఎలా కట్టాలి. మీనాక్షి.. నేను ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు’ అని రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పనిచేస్తున్న సంస్థలో కనిపించకుండా పోయిన డబ్బు కారణంగా తనపై దొంగ ముద్ర పడిందని ఆ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిలింనగర్ దీన్దయాల్నగర్కు చెందిన బొల్లం శివరాం, మీనాక్షి దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. శివరాం మణికొండలోని ఓ మార్ట్లో పనిచేస్తున్నాడు. వారం రోజులుగా మానసిక వేదనకు గురవుతున్నాడు. గమనించిన భార్య కారణం అడిగినా చెప్పలేదు.
ఈ నెల 27న సోదరుడి కుమారుడి బారసాల ఉండటంతో మీనాక్షి మేడ్చల్కు వెళ్లింది. శివరాం పనిచేసే మార్ట్కు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చాడు. భోజనం చేయమని తల్లిదండ్రులు అడిగినా పట్టించుకోకుండా మేడ మీద ఉన్న బెడ్రూంకు వెళ్లాడు. అనుమానం వచ్చిన తండ్రి కొద్ది సేపటి తర్వాత బెడ్రూం తలుపు కొట్టాడు. కానీ తెరవలేదు. స్థానికుల సహాయంతో పగలకొట్టగా శివరాం ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. కిందకు దించి జూబ్లీహిల్స్లోని ఆ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఉరేసుకున్న గదిలో ఓ రిజిస్టర్లో ఆయన రాసినట్లుగా లేఖ ఉంది. మార్ట్ ఉద్యోగుల ఒత్తిడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మీనాక్షి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సంతో్షపై 306 ఐపీసీ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-01-29T17:40:51+05:30 IST