కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని బీజేపీ ధ్వంసం చేస్తోంది
ABN, First Publish Date - 2022-08-10T05:32:45+05:30
కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని బీజేపీ ధ్వంసం చేస్తోంది
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి
ఘనంగా ప్రారంభమైన ఆజాదీకా గౌరవ యాత్ర
పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
కాజీపేట టౌన్, ఆగస్టు 9: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఆజాది కా గౌరవ యాత్ర మంగళవారం ఉదయం కాజీపేట ఫాతిమానగర్ జంక్షన్ నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరాగా వరంగల్, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధిని నేడు బీజేపీ ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఎక్కడా అని ప్రశ్నించారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆర్భాటాలకు తెరలేపిందని దుయ్యబట్టారు. బీజేపీ చేపట్టిన ప్రచార ఆర్భాటాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. స్వాతంత్ర్యాన్ని తీసుకు రావడంతో పాటు భారత దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించిన ఘనత కాంగ్రె్సకే దక్కుతుందన్నారు. ఈ యాత్ర హనుమకొండ, వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో కొనసాగుతుందని తెలిపారు. ఆనాటి స్వాతంత్య్ర దినోత్సవ చరిత్రను, ఉద్యమ ఘట్టాలను మహనీయుల వీరగాథలను ప్రజలకు వివరించడానికి ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. అంతకు ముందు ఫాతిమా జంక్షన్లోని మదర్ థెరిసా విగ్రహానికి పూల మాల వేసి యాత్రను ప్రారంభించారు. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావడంతో జంక్షన్లో సందడి నెలకొంది. జై కాంగ్రెస్ అంటూ చేసిన నినాదాలతో ఆప్రాంతం మారుమోగింది. ఫాతిమా జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సుబేదారి, ఆదాలత్, హనుకొండ చౌరస్తా, ములుగు రోడ్డు మీదుగా ఎంజీఎం సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు కొనసాగింది. యాత్రలో భాగంగా సుబేదారి కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపానికి నాయిని రాజేందర్రెడ్డి పూలమాల వేసి అమరులకు నివాళులు అర్పించారు. ఈ యాత్రలో మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వర్థన్నపేట, పరకాల నియోజకవర్గం కో ఆర్డినేటర్లు నమిండ్ల శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్, ఇవి. పోతుల శ్రీమాన్, ఎండీ. అంకూస్, ఎండీ. రహమతుల్లా, గొట్టిముక్కల రమణారెడ్డి, పెరుమాళ్ళ రామక్రిష్ణ, మహ్మద్ రియాజ్, బంక సంపత్, అంబేద్కర్, స్వప్న, మమత, కార్తీక్, సతీష్, వంశీ, విక్రమ్, భారతమ్మ, నేహాల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-10T05:32:45+05:30 IST