ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య.. ఇప్పటికీ ఎర్ర బస్సు కోసం ఎదురుచూస్తూనే..
ABN, First Publish Date - 2022-11-02T21:16:51+05:30
రాజకీయాల్లో పదవులు రాగానే గర్వం పెరుగుతుందని అందరూ అంటూ ఉంటారు. ఈ మాటలు ఊరికే అనడం లేదు. ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం అలాగే ఉంది.
రాజకీయాల్లో పదవులు రాగానే గర్వం పెరుగుతుందని అందరూ అంటూ ఉంటారు. ఈ మాటలు ఊరికే అనడం లేదు. ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం అలాగే ఉంది. ఇది కాదనలేని వాస్తవం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు తరాలకు తరగని ఆస్తిని కూడగట్టుకుంటున్న సందర్భంలో మనం ఉన్నాం. ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితే చాలు కోట్లు గడిస్తున్నారు. ఆయన మాత్రం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా చిల్లిగవ్వ కూడా సంపాదించుకోలేదు. నేటికీ వ్యవసాయ పనులు చేసుకుంటూ.. విప్లవోద్యమ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల్లో నాలుకలా మెదలుతున్నారు. ఇంత సాదారణ జీవితాన్ని గడుపుతున్న ఆయన ఎవరో కాదు.. గుమ్మడి నర్సయ్య. అప్పుడెప్పుడో తెలంగాణ సాయుధపోరాటాన్ని నడిపిన రావి నారాయణరెడ్డి అసెంబ్లీకి రిక్షాలో వెళ్లేవారని విన్నాం. గుమ్మడి నర్సయ్య కూడా అంతే ఎక్కడో ఓ మూలనున్న ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి అసెంబ్లీకి ఎర్రబస్సులో వచ్చేవారు. ఇతర పనులపై హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం తింటూ కనిపిస్తుంటారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం సాధారణ జీవితాన్నే గడిపారు. బస్సులు, రైళ్లలో హైదరాబాద్ వచ్చి ఆటోలో అసెంబ్లీకి వెళ్లడం, పార్టీ ఆఫీస్లోనే బస చేయడం ఆయనకు అలవాటు. ఇప్పటికీ అయన పేరు మీద ఓ పొలం తప్ప మరేమీ లేదంటే అతిశయోక్తి కాదు.
ధైర్యశాలి గుమ్మడి నర్సయ్య
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకుల గూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించారు. సీపీఐ ఎంఎల్ పార్టీ విప్లవ రాజకీయాల్లో రాష్ట్ర నాయకుడిగా, ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి.. 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. హంగు, ఆర్బాటాలకు తావులేకుండా తన పదవీ కాలమంతా ప్రజల మధ్యే గుమ్మడి నర్సయ్య గడిపారు. ఇప్పటికీ ఒక సామాన్య జీవితం గడుపుతున్నారు. ఖమ్మం ఏజెన్సీతో పాటు గోదావరి అవతల నక్సల్స్ ప్రాభల్యం ఎక్కువ. దీన్ని పరిగణలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం నర్సయ్యకు ఇద్దరు గన్మెన్లను కేటాయించింది. గన్మెన్లను వద్దని చెప్పి వారించిన ధైర్యశాలి నర్సయ్య. ఆయనకు ఎమ్మెల్యే భృతి కింద వచ్చిన మొత్తాన్ని కూడా పార్టీని నడిపించడానికి ఇచ్చారని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఇప్పటికీ ఆయన వ్యవసాయం మీదే ఆధాపడుతూ జీవనం గడుపుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో రెండుసార్లు ఓడిపోయారు. అయినా పార్టీని అంటిపెట్టుకుని, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ప్రజలతోనే జీవిస్తున్నారు నర్సయ్య. ఓటమి చెవి చూసిన నేతలు పార్టీలు మారుతూ ఉంటారు. కానీ నర్సయ్య మాత్రం అదే పార్టీ, అదే ఎర్రజెండా నీడలోనే ఉన్నారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఏనాడు కూడా అవినీతిని దరిచేరనివ్వని గొప్ప నాయకుడు. ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలంటే కోట్లు వెచ్చించాలి. ప్రస్తుత మునుగోడు ఉప ఎన్నికలో ధనప్రవాహం పొంగుతున్న సందర్భంలో గుమ్మడి నర్సయ్య మాత్రం ఇప్పటికీ ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
Updated Date - 2022-11-02T21:16:53+05:30 IST