కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాలలు
ABN, First Publish Date - 2022-09-30T08:53:32+05:30
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
- విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు
- ఉత్తీర్ణత పెంచేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి సబిత
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అధ్యాపకులు చెప్పిన విషయాలను అనుసరించి, సమయాన్ని వృథా చేయకుండా చదివితే విజేతలుగా నిలుస్తారని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను గురువారం ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలకు దీటుగా సర్కారీ కళాశాలల్లో విద్యార్థులకు సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆదివాసి ఖిల్లాగా పేరున్న కొమురంభీం జిల్లా విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం ప్రసంశనీయమని అన్నారు. ఐఐటీ, నీట్ ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన శిక్షణ కూడా సత్ఫలితాలు ఇచ్చిందని తెలిపారు.
Updated Date - 2022-09-30T08:53:32+05:30 IST