గోరటి వెంకన్న ఓ విప్లవకారుడు!
ABN, First Publish Date - 2022-03-13T08:31:27+05:30
ప్రజా వాగ్గేయకారుడైన గోరటి వెంకన్నకు ఈ వ్యవస్థ తీరుతెన్నులపై పూర్తి అవగాహన ఉన్నదని, ప్రపంచీకరణను బాగా అధ్యయనం చేసినందుకే ఆయన ‘పల్లే కన్నీరు పెడుతుందో’ వంటి అద్భుతమైన పాటను రాయగలిగారని సినీ నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు.
- వ్యవస్థ తీరు తెన్నులపై అవగాహన
- ఆయనో తాత్వికుడు, ప్రకృతి మనిషి
- వెంకన్న విశ్వ మానవుడు
- ఢిల్లీ పౌరసన్మాన సభలో వక్తలు
న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా వాగ్గేయకారుడైన గోరటి వెంకన్నకు ఈ వ్యవస్థ తీరుతెన్నులపై పూర్తి అవగాహన ఉన్నదని, ప్రపంచీకరణను బాగా అధ్యయనం చేసినందుకే ఆయన ‘పల్లే కన్నీరు పెడుతుందో’ వంటి అద్భుతమైన పాటను రాయగలిగారని సినీ నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. గోరటి రచించిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా శనివారం ఢిల్లీలో ఆయనకు పౌర సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రముఖ సాహితీవేత్తలు కె. శివారెడ్డి, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, బన్న ఐలయ్య, యాకూబ్, వాసిరెడ్డి నవీన్, కృష్ణుడు, పత్తిపాక మోహన్ పాల్గొన్నారు. గోరటిలో తాత్వికుడు, బైరాగి మాత్రమే కాక విప్లవకారుడు కూడా ఉన్నారని ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. వెంకన్న ప్రతిభను గుర్తించి ఆయనకు శాసన మండలి సభ్యత్వం ఇవ్వడం కేసీఆర్ తీసుకున్న మంచి నిర్ణయం అని ప్రశంసించారు. వెంకన్న ఆధునిక తాత్వికుడని, ప్రకృతి, మనిషి ఆయన సాహిత్యానికి కేంద్ర బిందువులు అని రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పాట అన్నిటికంటే ఆదిమ ప్రక్రియ అని, మనిషి తొలి సాహిత్యం పాటనుంచే పుట్టిందని, అలాంటి పాటకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఉత్తమ పరిణామమని శివారెడ్డి అన్నారు. వెంకన్న విశ్వ మానవుడని యాకూబ్ అన్నారు. జనం మధ్యలో ఉంటూ పల్లె జీవితంలో భాగమై రచనలు చేయడం వల్లే వెంకన్న గొప్ప రచనలు చేయగలిగారని వాసిరెడ్డి నవీన్ ప్రశంసించారు.
జస్టిస్ రమణను అలరించిన వెంకన్న
కాగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని స్వీకరించేందుకు ఢిల్లీకి వచ్చిన వెంకన్నను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలిపించి ఘనంగా సన్మానించారు. వెంకన్నతో పాటలు పాడించుకున్నారు. వెంకన్న తాను రచించిన వల్లంకి తాళం పుస్తకాన్ని జస్టిస్ రమణకు బహూకరించారు.
Updated Date - 2022-03-13T08:31:27+05:30 IST