రైతు బంధు కోసం ఏడో రోజు 201.91 కోట్ల విడుదల
ABN, First Publish Date - 2022-01-06T00:11:09+05:30
తెలంగాణలో రైతు బంధు పదకంలో భాగంగా ప్రభుత్వం భారీగా నిధులు మంజూరుచేస్తోంది
హైదరాబాద్: తెలంగాణలో రైతు బంధు పదకంలో భాగంగా ప్రభుత్వం భారీగా నిధులు మంజూరుచేస్తోంది. ఈ మేరకు రైతు బంధు నిధుల మంజూరు ప్రారంభించిన ఏడో రోజు 201.91 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా 65,269 మంది రైతుల ఖాతాలకు రైతుబంధు నిధులు బదిలీ చేసినట్టు తెలిపారు. ఈ పథకం అమలుకు ఇప్పటి వరకు మొత్తం 60,16,697 మంది రైతుల ఖాతాలకు రూ.6008.27 కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. దేశంలో రైతులకు చేయూతనిచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు పథకాలు వ్యవసాయరంగానికి ఊపిరిపోశాయని అన్నారు.ప్రభుత్వాల సహకారం లేక వ్యవసాయానికి దూరమైన రైతన్నలకు ఆత్మస్థయిర్యం నింపిన ఘనత సీఎం కేసీఆర్ దేనని చెప్పారు. సమైక్య పాలనలో ఇతర రంగాలలో ఉపాధి వెతుక్కున్న రైతులు తిరిగి వ్యవసాయరంగం వైపు మళ్లారని తెలిపారు.ఈ ఘనత, ఈ భరోసా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిందేనన్నారు.అందుకే ఊరూరా రైతులు రైతుబంధు సంబరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి నీరాజనాలు పడుతున్నారని తెలిపారు.తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ఆ దిశగా వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో స్పష్టమయిన ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని అన్నారు.
Updated Date - 2022-01-06T00:11:09+05:30 IST