TS News: విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు
ABN, First Publish Date - 2022-08-11T13:53:46+05:30
ఉపాధి హామీ పథకం అమలును పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లను గురువారం నుంచి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: ఉపాధి హామీ పథకం అమలును పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లను గురువారం నుంచి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పనులను పర్యవేక్షించడం, కూలీల మస్టర్ జాబితా రాయడం, జాబ్కార్డులు ఉన్నవారంతా ఉపాధి పనులకు వచ్చేలా చూడడం వంటి విధులను నిర్వర్తించే ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభు త్వం ఆకస్మికంగా తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన 9,600 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు రెండున్నరేళ్లుగా ఆందోళనలు చేపట్టడం, ప్రభుత్వానికి వినతులివ్వడం వంటివి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
Updated Date - 2022-08-11T13:53:46+05:30 IST