విద్యుత్ కార్పొరేటీకరణ వద్దు..
ABN, First Publish Date - 2022-08-09T05:23:36+05:30
విద్యుత్ కార్పొరేటీకరణ వద్దు..
కేటీపీపీ ఎదుట ఉద్యోగుల మహా ధర్నా
చెల్పూరు, ఆగస్టు 8: విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే సవరణ బిల్లును వెంటనే కేంద్రం ఉపసహరించుకోవాలని ఉద్యోగులు నిరస నకు దిగారు. గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ) ఎదుట సోమవారం మహా ధర్నా చేశారు. జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఇంజనీర్ల సమన్వయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులను బహిష్కరించి ప్రధాన గేటు వద్ద కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదాలు చేశారు. ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. దేశ సంపదను కార్పొరేటీకరణ చేసేందుకు నిర్ణయించడం దారుణమని విమర్శించారు. విద్యుత్ రంగం ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, ఉద్యోగులకు భద్రత ఉంటుందన అన్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఈఏ, టీఎస్ఈఏఈఏ, 327, 1104, 1535, బీఎంఎస్, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, మహిళా సంఘాలు, టీఈఈజేఏసీ నాయకులు పాల్గొన్నారు. మహాధర్నాకు వెయ్యి మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. కేటీపీపీ సీఈ సిద్ధయ్య, ఎస్ఈలు సంఘీభావం తెలిపారు.
Updated Date - 2022-08-09T05:23:36+05:30 IST