ఎనిమిదేళ్ల తర్వాత విమర్శిస్తారా?
ABN, First Publish Date - 2022-02-10T07:56:14+05:30
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని తప్పుపట్టే అధికారం ప్రధానికి కూడ
- విభజన చట్టంపై ప్రధాని వ్యాఖ్యలు సరికాదు: సురేశ్రెడ్డి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని తప్పుపట్టే అధికారం ప్రధానికి కూడ లేదని, ఎనిమిదేళ్ల క్రితం జరిగిన విభజన గురించి ప్రధాని వ్యాఖ్యానించడాన్ని టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర బడ్జెట్పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ సాధనకోసం కేసీఆర్ 14 ఏళ్ల పాటు ఉద్యమించి, సాధించారని గుర్తు చేశారు. ఆరోజు పునర్విభజన చట్టానికి బీజెపీ కూడా మద్దతించిందని, ఇపుడు ఆచట్టం సక్రమంగా జరగలేదంటూ ప్రశ్నించే అధికారం ప్రధానికి లేదన్నారు.
గత ఎనిమిదేళ్ల నుంచి రెండు తెలుగు రాష్ర్టాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ నిరశా నిస్పృహలకు గురిచేసిందన్నారు. రైతులకు బడ్జెట్లో ఏమాత్రం ఉపశమనం కలిగించలేదన్నారు. నరేగా పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్రం దోహదపడాలని కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ కరోనా వల్ల చతికిలపడ్డాయని, వాటిని ఆదుకోవాలని, వారికిచ్చిన రుణాలపై వడ్డీలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2022-02-10T07:56:14+05:30 IST