రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల్లేవ్!
ABN, First Publish Date - 2022-02-09T07:32:18+05:30
రాష్ట్రంలో కొవిడ్ కరోనా మూడో వేవ్ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు గడల
- కార్యకలాపాలన్నీ కొనసాగించుకోవచ్చు
- 3 వారాల్లోనే మూడో వేవ్ ముగిసింది
- ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఆపాలి
- ఆన్లైన్ పాఠాలొద్దు.. పిల్లల్ని బడికి పంపాలి
- కొద్ది నెలలపాటు కొత్త వేరియంట్లు రావు
- పాజిటివిటీ రేటు 2 శాతమే: డీహెచ్ గడల
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కరోనా మూడో వేవ్ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు చెప్పారు. ఇక విద్య, వాణిజ్య, వ్యాపార కార్యాకలపాలన్నీ కొనసాగించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్ ఆంక్షలేమీ లేవన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కొవిడ్ తీవ్రత తగ్గిందన్నారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్కు విరామం ఇవ్వాలని సూచించారు. వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చని తెలిపారు. ఉద్యోగులు వంద శాతం కార్యాలయాలకు హాజరు కావొచ్చని చెప్పారు. విద్యా సంస్థలు ఆన్లైన్ తరగుతులకు స్వస్తి పలకాలని సూచించారు.
తల్లిదండ్రులు భయపడకుండా పిల్లల్ని బడికి పంపాలని కోరారు. ఇళ్లలోనే ఉంటే అనేక మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. విద్యార్థులు రెండేళ్లుగా తాము ఏ తరగతి చదువుతున్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని డీహెచ్ అన్నారు. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి విద్యా సంస్థలు తెరుచుకున్నాయని, ఎక్కడా పెద్దగా పాజిటివ్లు నమోదు కాలేదని తెలిపారు. 1 నుంచి రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలూ కొనసాగడం లేదన్నారు. ప్రజలు వేవ్ల గురించి పట్టించుకోవద్దని చెప్పారు. కానీ, కొవిడ్ మార్గదర్శకాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలన్నారు.
టీకా తీసుకోని వారే ఆస్పత్రిపాలయ్యారు..
రాష్ట్రంలో థర్డ్ వేవ్ డిసెంబరు 28 నుంచి మొదలైందని గడల చెప్పారు. జనవరి 23 నాటికి కేసులు పతాక స్థాయికి చేరాయన్నారు. మూడో వేవ్లో 70 శాతం కేసులు ఒమైక్రాన్లోని బీఏ2 ఉప రకానివేనని తెలిపారు. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 5శాతం ఉంటే, తెలంగాణలో 2శాతమే ఉందని చెప్పారు. బెడ్ ఆక్యుపెన్సీ కూడా మనదగ్గర 4 శాతమే ఉందన్నారు. తొలి వేవ్ 8 నెలలు, రెండోవేవ్ 4-6 నెలలు కొనసాగిందన్నారు. మూడోవేవ్ మాత్రం 25 రోజుల్లో (3 వారాలు)నే ముగిసిందన్నారు. మూడో వేవ్ నాటికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. వచ్చే కొద్ది నెలల పాటు కొత్త వేరియంట్లు రావని తెలిపారు. టీకా తీసుకోని వారే ఎక్కువగా ఆస్పత్రి పాలయ్యారని డీహెచ్ అన్నారు. ఒక్క డోసూ తీసుకోని వారిలో 2.8 శాతం మంది, రెండు డోసులూ తీసుకున్న వారిలో 1 శాతం, బూస్టర్ డోసు తీసుకున్నవారిలో 0.7 శాతమే ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. కొవిడ్ టీకా సమర్థంగా పనిచేసిందన్నారు. మూడో వేవ్లో 31 లక్షల కొవిడ్ టెస్టులు చేయగా.. లక్ష పాజిటివ్లు నమోదయ్యాయని గడల వివరించారు.
మేడారం జాతరకు వైద్యశాఖఏర్పాట్లు
మేడారం జాతరకు వైద్యశాఖ తగిన విధంగా సిద్ధమైందని గడల చెప్పారు. కొవిడ్ టెస్టులతో పాటు టీకా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేకంగా 150 పడకల ఆస్పత్రిని సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో కొవిడ్ సాధారణ ఫ్లూగా మారుతుందన్నారు. డెంగీ వైరస్ మాదిరిగా రోగ నిరోధక శక్తి తగ్గించి మళ్లీ మళ్లీ దాడి చేసే అవకాశాలూ లేకపోలేదన్నారు. ఇక థర్డ్ వేవ్లో కొవిడ్ తర్వాత చాలామందిలో మానసిక రుగ్మతలు కనిపించాయన్నారు. అలాంటి వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21 వేలకు తగ్గింది. మంగళవారం 69,892 టెస్టులు చేయగా.. 1061 మందికి పాజిటివ్గా తేలింది. వైర్సతో ఒకరు చనిపోయారు. 3590 మంది కోలుకున్నారు.
Updated Date - 2022-02-09T07:32:18+05:30 IST