మిషన్ భగీరథలో కలుషిత నీరు: విజయశాంతి
ABN, First Publish Date - 2022-04-08T02:09:40+05:30
ఇంటింటికి మంచినీరు అందించే మిషన్ భగీరథలో మలినాలతో కూడిన కలుషిత
హైదరాబాద్: ఇంటింటికి మంచినీరు అందించే మిషన్ భగీరథలో మలినాలతో కూడిన కలుషిత నీరు వస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. మిషన్ భగీరథ వైఫల్యంలో కేసీఆర్ సర్కార్ను విమర్శిస్తూ విజయశాంతి తన ఫేస్బుక్లో పలు ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేశారు. కేసీఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టామని చెప్పుకుంటున్న మిషన్ భగీరథ పథకం నీరుగారిపోతోందని ఆమె పేర్కొన్నారు. ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏడాదిగా మిషన్ భగీరథ నీళ్లను ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా సరఫరా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రూల్స్ ప్రకారం... ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఫిల్టర్ బెడ్లపైన బ్యాక్టీరియా, ఇతర మలినాలను తొలగించి నీటి సరఫరా చేయాలని ఆమె పేర్కొన్నారు. కానీ ఏడాదిగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రిపేర్లో ఉండడం, నెల కింద ఫిల్టర్ బెడ్లు కూడా దెబ్బతినడంతో అలానే సప్లై చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ని అపర భగీరథుడిగా చెప్పుకునే భజన బ్యాచ్ దీనికేం జవాబు చెబుతారని ఆమె ప్రశ్నించారు. పానగల్లు ఉదయ సముద్రం రిజర్వాయర్లోని ఇన్టేక్ వెల్ నుంచి రా వాటర్ పంపింగ్ చేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి పంపిస్తారని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ ప్రీ క్లోరినేషన్, పోస్ట్ క్లోరినేషన్ పద్ధతిలో నీటిని శుద్ధి చేశాక, వాటర్ స్టోరేజీ సంప్ నుంచి గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తారన్నారు.
అయితే ఏడాదిగా పంప్హౌస్ రిపేర్లు నడుస్తుండడం, మరమ్మతుల వల్ల నెల రోజుల నుంచి ఫిల్టర్ బెడ్లు బంద్ చేయడంతో నీటి శుద్ధి ప్రక్రియ ఆగిపోయిందని ఆమె పేర్కొన్నారు. బదులుగా ఆలం, క్లోరిన్ కలిపిన నీటినే స్టోరేజీ పంప్ నుంచి డైరెక్ట్గా సరఫరా చేస్తున్నారని ఆమె తెలిపారు. నీటిలో కంటికి కనిపించని మలినాలను శాండ్ ఫిల్టర్బెడ్స్ పైన తొలగించాల్సి ఉంటుందని, కానీ, ఫిల్టర్ బెడ్ల రిపేర్ల వల్ల ఆలం, క్లోరిన్ కలిపిన నీటినే జనం తాగాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఆ నీరు తాగే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం లేదన్నారు. వీళ్లే శాస్త్రవేత్తలు అయినట్టు ఆలం, బెల్లం అంటూ వారికిష్టమొచ్చిన నీళ్లు అందించడం ఏంటీ అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే పూర్తిస్థాయిలో రిపేర్లు చేయించి మంచినీరు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. పేరుకు మాత్రం తెలంగాణ మొత్తం స్వచ్ఛమైన నీరు సప్లై చేస్తున్నామని కేసీఆర్ సర్కార్ గొప్పలకు ఏం తక్కువ లేదని ఆమె ఆరోపించారు. ఈ ఆబద్ధాల కోరు సర్కార్ను తెలంగాణ ప్రజానీకమే జలసమాధి చేయడం ఖాయమని ఆమె హెచ్చరించారు.
Updated Date - 2022-04-08T02:09:40+05:30 IST