మంత్రి అనుచరుడు హైదర్ హత్యకూ కుట్ర
ABN, First Publish Date - 2022-03-05T06:43:01+05:30
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన కేసులో
- అతని ద్వారా నిందితుల వ్యాపార లావాదేవీలు తెలుసుకున్న శ్రీనివాస్ గౌడ్
- రిమాండు రిపోర్టులో పోలీసుల వెల్లడి
హైదరాబాద్ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన కేసులో పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు ఉన్నట్లు తెలిసింది. శ్రీనివాస్ గౌడ్తో పాటు ఆయన ప్రధాన అనుచరుడైన గులాం హైదర్ను సైతం నిందితులు చంపాలనుకున్నారని తెలిసింది. ఈ కుట్ర కేసులో ప్రధాన నిందితులు చలువుగల్లి రాఘవేంద్రరాజు, నాగరాజు, అమరేందర్రాజు, మధుసూదన్రాజు సొంత అన్నదమ్ములు. కాగా.. అమరేందర్రాజు మహబూబ్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. వారికి బార్ అండ్ రెస్టారెంట్తో పాటు పలు వ్యాపారాలున్నాయి. ఒకప్పుడు వారికి మంత్రితో సత్సంబంధాలున్నప్పటికీ ఇప్పుడు విభేదాలున్నాయి.
ఈ క్రమంలో తన ప్రధాన అనుచరుడైన గులాం హైదర్ ద్వారా నిందితుల వ్యాపారాలు, లావాదేవీలను మంత్రి తెలుసుకున్నారు. హైదర్ సహకారంతో తమను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టినట్లు రాఘవేంద్రరాజు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దాంతో మంత్రితో పాటు ఆయన అనుచరుడు హైదర్పై కక్ష పెంచుకున్న నిందితులు ఆ ఇద్దరినీ హత్య చే యాలని పథకం పన్నారు. ఈ క్రమంలో నేరచరిత్ర ఉన్న ఫరూఖ్ సహకారం తీసుకోవాలనుకున్నారు. మంత్రిని హత్య చేయడానికి ఫరూక్ ఒప్పుకోలేదు. దాంతో ఫరూక్పై కన్నేసి ఉంచాలని నిందితులు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 25న మధ్యా హ్నం పేట్ బషీరాబాద్ పోలీ్సస్టేషన్ పరిధి సుచిత్ర వద్ద ఫరూఖ్, హైదర్ కనిపించడంతో మధుసూదన్రాజు, అతని సోదరులు.. షాకయ్యారు. తమ ప్లాన్ బయటకు తెలిస్తే కథ మొత్తం అడ్డం తిరుగుతుందని భా వించిన నిందితులు ఫరూఖ్ను, హైదర్ను చంపేయాలని మారణాయుధాలతో వెంటపడ్డారు. గమనించిన ఆ ఇద్దరు తప్పించుకున్నారు. రహస్యంగా తలదాచుకొ ని సాయంత్రం 5 గంటలకు పేట్బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించినట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.
Updated Date - 2022-03-05T06:43:01+05:30 IST