అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయండి
ABN, First Publish Date - 2022-09-08T06:09:43+05:30
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయండి
జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), సెప్టెంబరు 7 : నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్ష జరిపారు. నగరబాట, పార్కులు, డివిజన్ల పరంగా రహదారులు, డ్రెయినేజీ తదితర పనులు, బస్తీ దవాఖానాలు, వెజ్ మార్కెట్ల నిర్మాణం, గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించారు. బస్తీ దవాఖానాల పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు.
యంత్రాలతోనే శుభ్రపరచాలి..
సెప్టిక్ ట్యాంకులను యంత్రాల ద్వారానే శుభ్రపరచాలని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు. సెప్టిక్ ట్యాంకుల శుభ్రత, ఫిర్యాదుల గురించి ఏర్పాటు చేసిన 14420 టోల్ ఫ్రీ నెంబరుపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ‘సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్’ నిబంధనల మేరకు యంత్రాలను వినియోగించాలని స్పష్టం చేశారు.
Updated Date - 2022-09-08T06:09:43+05:30 IST