TS News: ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేశారు: సంజయ్
ABN, First Publish Date - 2022-08-26T00:59:01+05:30
ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేశారని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) దుయ్యబట్టారు.
హైదరాబాద్: ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేశారని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడులు, అక్రమ కేసులతో పాదయాత్రను అడ్డుకోవాలని చూశారని, ప్రభుత్వం ఇకనైనా నికృష్ట ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు. అధికారిక కార్యక్రమంలో ప్రధానిపై సీఎం కేసీఆర్ (CM KCR) ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తారా? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్ట్ను మోదీ ఆపారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) ఎడారిగా మారడానికి కేసీఆరే కారణమని ధ్వజమెత్తారు. పంటలు కావాలా?, మంటలు కావాలా? అని కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని చెప్పింది కేసీఆర్ కాదా?.. లిక్కర్ స్కామ్ ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు? అని ప్రశ్నించారు. బీజేపీ పేరు చెప్పుకుంటూ కేసీఆరే ఘర్షణలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మతఘర్షణలు లేవని బండి సంజయ్ తెలిపారు.
Updated Date - 2022-08-26T00:59:01+05:30 IST