రైతు రాజ్యాన్ని తీసుకవస్తా: షర్మిల
ABN, First Publish Date - 2022-04-05T02:44:29+05:30
తనను ఆశీర్వదించి అధికారం ఇస్తూ రాష్ట్రంలో మళ్లీ రైతు రాజ్యాన్ని
ఖమ్మం: తనను ఆశీర్వదించి అధికారం ఇస్తూ రాష్ట్రంలో మళ్లీ రైతు రాజ్యాన్ని తీసుక వస్తానని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బచ్చొడులో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మాటా ముచ్చట కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులతో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఊసరవెల్లిలా మారాడన్నారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చీమకుట్టినట్టు కూడా కేసీఆర్కి లేదన్నారు. ప్రతి చివరి గింజ కొనుగోలు చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్, రైతు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఢిల్లీలో ధర్నాలతో డ్రామాలు ఆడుతున్నాడని ఆమె మండిపడ్డారు. ఏ ప్రభుత్వంలో నైనా తాను చెప్పిన పంటనే వేయాలనే హక్కు పాలకులకు ఎక్కడైనా ఉందా అని ఆమె ప్రశ్నించారు. మద్దతు ధర ఉన్న పంట పండించకపోతే రాష్ట్రంలో రైతులు ఏ పనిచేసి బతకాలన్నారు. పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతుల్ని హింసిస్తున్న కేసీఆర్కి సీఎం పదవి అవసరమా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేని సమయంలో ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు వైఎస్సార్టీపీ పార్టీ పుట్టిందని ఆమె తెలిపారు. రాజన్న బిడ్డగా మీ ముందుకు వచ్చానని తనను ఆశీర్వదించాలని షర్మిల కోరారు.
Updated Date - 2022-04-05T02:44:29+05:30 IST