బీజేపీ అంటే కేసీఆర్కు వణుకు
ABN, First Publish Date - 2022-02-28T08:58:32+05:30
బీజేపీ అంటే సీఎం కేసీఆర్ గజగజ వణుకుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఫాం హౌస్ నుంచి ప్రగతిభవన్కు, అక్కడి నుంచి ధర్నాచౌక్కు కేసీఆర్ను బీజేపీయే రప్పించిందని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటించడానికి..
తల్వార్లతో తిరిగేలా చేయొద్దు: బండి
లక్ష మందితో ఆత్మగౌరవ సభ : జిట్టా
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అంటే సీఎం కేసీఆర్ గజగజ వణుకుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఫాం హౌస్ నుంచి ప్రగతిభవన్కు, అక్కడి నుంచి ధర్నాచౌక్కు కేసీఆర్ను బీజేపీయే రప్పించిందని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటించడానికి తామే కారణమని చెప్పారు. కేసీఆర్ అంటకాగుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లోని కుటుంబపార్టీలు కలిస్తే దేశం ఎంత దయనీయంగా మారుతుందో ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవల యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, నాయకురాలు రాణిరుద్రమ ఆదివారం భారీ ర్యాలీతో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంజయ్ మాట్లాడారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థుల్లో ఒక్కరితోనైనా కేసీఆర్ మాట్లాడారా? అని నిలదీశారు.
కర్మన్ఘాట్లో గోరక్షకులపై తల్వార్లు పట్టుకుని హనుమాన్ ఆలయంలో దాడి చేసిన వారిని అరెస్టు చేయాల్సిందిపోయి, గోరక్షకులపైనే 307 కేసులు పెట్టారని సంజయ్ మండిపడ్డారు. తల్వార్లు పట్టుకుని తిరిగే పరిస్థితి తమకు కల్పించవద్దంటూ కేసీఆర్కు అల్టిమేటం జారీచేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువత కుటుంబాలను త్యాగం చేశారని బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ఛుగ్ అన్నారు. ‘‘ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న కేటీఆర్, కవిత ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నారు? కవిత ఏ జైలుకు వెళ్లారు? కేటీఆర్ ఎక్కడ సత్యాగ్రహం చేశారు?’’ అని సీఎంను నిలదీశారు. విజయశాంతి మాట్లాడుతూ, ‘‘ఒంటరిగా తెలంగాణ తెచ్చే శక్తి మీకు ఉందా? 1200 మంది యువత సరదాగా చనిపోయారా?’’ అని నిలదీశారు. పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టిసారించబోతోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పోలీసులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కాగా.. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ సంస్థాగత సహకార్యదర్శి శివప్రకాశ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్లతో విడివిడిగా సమావేశమయ్యారు.
Updated Date - 2022-02-28T08:58:32+05:30 IST