TRSకు రైతన్నలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం: Vijayashanti
ABN, First Publish Date - 2022-05-21T16:24:58+05:30
రైతు ప్రభుత్వమని చెప్పుకునే కేసీఆర్ సర్కార్... చేతల్లో మాత్రం అందుకు విరుద్దంగా ఉందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.
హైదరాబాద్: రైతు ప్రభుత్వమని చెప్పుకునే కేసీఆర్(KCR) సర్కార్... చేతల్లో మాత్రం అందుకు విరుద్దంగా ఉందని బీజేపీ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. మంచిర్యాల జిల్లాలో రూలింగ్ పార్టీ నాయకులు రైతుల మెడకు ఉరితాడు చుడుతున్నారని ఆరోపించారు. కొంతమంది అధికార పార్టీ లీడర్లు, వారి బంధువులు, అనుచరులు నకిలీ విత్తనాలతో రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే క్వింటాళ్ల కొద్దీ విత్తనాలను గ్రామాలకు తరలించి రైతులకు అంటగట్టారని తెలిపారు. జిల్లాలో భీమిని, నెన్నెల మండలాల్లో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా నడుస్తోందని అన్నారు. సీజన్ ప్రారంభానికి రెండు మూడు నెలల ముందే ఏపీలోని కర్నూలు, నంద్యాల, గుంటూరు ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో నకిలీ సీడ్ భీమినికి చేరిందని చెప్పారు. నెన్నెల మండలంలో కూడా అధికార పార్టీ లీడర్ల కనుసన్నల్లో నకిలీ విత్తన దందా కొనసాగుతోందని బీజేపీ నేత వెల్లడించారు.
ఆంధ్రాకి చెందిన ఓ ముఠా మందమర్రి కేంద్రంగా బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో నకిలీ దందా సాగిస్తోందన్నారు. కౌలు రైతుల ముసుగులో ఇక్కడికి వచ్చిన కొందరు... వ్యవసాయాన్ని వదిలి నకిలీ సీడ్ బిజినెస్లో ఆరితేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. కొద్దిరోజులుగా ఫెర్టిలైజర్స్ షాపుల్లో నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారని అన్నారు. అడపాదడపా కేసులు పెట్టినా.. అధికార పార్టీ లీడర్ల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదని మండిపడ్డారు. రైతులను నిండా ముంచుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ రైతన్నలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు.
Updated Date - 2022-05-21T16:24:58+05:30 IST