ఈ - శ్రమ్తో అసంఘటిత రంగ కార్మికులకు బహుళ ప్రయోజనాలు
ABN, First Publish Date - 2022-01-07T07:11:28+05:30
అ సంఘటిత రంగ కార్మికులకు బహుళ ప్రయోజనాలు అందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ రిజిస్ర్టేషన్కు జిల్లాలో మంచిస్పందన లభిస్తోంది.
జిల్లాలో ఇప్పటి వరకు 27,179 మంది కార్మికుల నమోదు
రైతులు, రైతు కూలీలకు వర్తింపు
జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ
విస్తృతస్థాయిలో ప్రచారం కల్పిస్తున్న కార్మికశాఖ
కార్మికసంఘాలకు ప్రచారంలో భాగస్వామ్యం
నిర్మల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : అ సంఘటిత రంగ కార్మికులకు బహుళ ప్రయోజనాలు అందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ రిజిస్ర్టేషన్కు జిల్లాలో మంచిస్పందన లభిస్తోంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రధానమంత్రి సురక్ష భీమా యో జన కింద రూ. 2 లక్షలబీమా సౌకర్యాన్ని ఈ - శ్రమ్ ద్వారా అందించనున్నారు. ఈ శ్రమ్లో ప్రతి అసంఘటిత రంగ కార్మికుడు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని ఇటు కార్మికశాఖ అధికారులు, అటు స్వచ్ఛంద సంస్థలు కొద్దిరోజుల నుంచి విసృతస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 27,179 మంది అ సంఘటిత రంగ కార్మికులు తమపేర్లను అన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఇలా నమోదైన వారందరికీ ప్రభుత్వం మొదటగా యుఏఎన్ కార్డును అందిస్తోంది. 16 సంవత్సరాలు నిండి, 59 సంవత్సరాల వయస్సులోపు ఉన్న వారందరికీ ఈ ప్రయోజనం వర్తింపజేయనున్నారు. బీమాసౌకర్యంతో పాటు వివిధ రకాలసంక్షేమ పథకాలను వీరికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను చెల్లించేవారు గాని, ఇప్పటికే ఈపీఎఫ్, ఈఎస్ఐ పరిధిలో నమోదైన వారు ఈ శ్రమ్కు మళ్లీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదంటున్నారు. ఇదిలా ఉండగా ఈ శ్రమ్ కారణంగా ఇటుకబట్టీలు, వీధి వర్తకులు, క్వారీల్లో పనిచేసే కార్మికులతో పాటు ఆటోడ్రైవర్లు, రైతులు, రైతుకూలీలు, అ సంఘటిత రంగ కార్మికులుగా కొనసాగుతున్నారు. అయితే అ సంఘటిత రంగాల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారో తెలుసుకునే అంశాన్ని కార్మికశాఖ ప్రయత్నిస్తోందంటున్నారు. ఈ శ్రమ్లో నమోదు చేసుకునే వారు తమ ఆధార్కార్డు వివరాలను, బ్యాంక్అకౌంట్, సెల్ఫోన్నంబర్ను తప్పనిసరిగా ఎంట్రీ చేయించాలని చెబుతున్నారు. జిల్లాలోని మిగతా కార్మికులు, కూలీలందరికీ ఈ శ్రమ్పథకాన్ని వర్తింపజేయాలంటున్నారు. కాగా గత కొద్దిరోజుల నుంచి పలు కార్మికసంఘాలు, స్వచ్చందసంఘాలు, ప్రజాసంఘాలు ఈ శ్రమ్లో నమోదు కోసం అ సంఘటిత రంగంలోని కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ ప్రచారానికి ప్రభుత్వపరంగా కూడా పెద్దఎత్తున ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇటుకబట్టీలు, తోపుడు బండ్లవారికి, క్వారీలు, ఆటో డ్రైవర్లకు సైతం ఈ శ్రమ్ ద్వారా ప్రయోజనం కల్పించబోతున్నందున ఈ పథకాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
కార్మిక సంఘాల పాత్ర కీలకం
జిల్లాలో అ సంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పలు కార్మిక, రైతు సంఘాలు ఈ శ్రమ్ నమోదుపై మరింతగా ప్రచారం చేపట్టాల్సి ఉందంటున్నారు. కేంద్రప్రభుత్వం ద్వారా అంద బోయే విలువైన ప్రయోజనాలను ప్రతీ కార్మికుడికి అందేట్లు చూడాల్సిన బాధ్యత కార్మిక సంఘాలదేనంటున్నారు. ప్రతి అసంఘటిత రంగ కార్మికుడు ఈ శ్రమ్పోర్టర్లో నమోదు చేసుకొని ప్రయోజనాలకు చేరువ కావాలంటున్నారు. అయితే కార్మికసంఘాలు ఈ ప్రయోజనాలను పొం దేందుకు విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలంటున్నారు. పట్టణప్రాంతాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో సైతం ఈ శ్రమ్లో నమోదుపై అర్హులైన వారందరికీ వివరించాలంటున్నారు. అ సంఘటిత రంగకార్మికులపై కార్మికసంఘాల ప్రభావం తీవ్రంగా ఉంటుం దన్నది బహిరంగ రహస్యమే. ఎలాంటి సమస్య తలెత్తినా ఆ సమస్యల పరిష్కారానికి కార్మికసంఘాలు ప్రయత్నిస్తుంటాయి. అలాంటిది కార్మికులకు స్వయంగా ప్రయోజనం దక్కించేందుకు రూపొందించిన ఈ శ్రమ్ను ఇటు కార్మికులు, కార్మిక సంఘాలు సద్వినియోగం చేసుకోవాలంటున్నారు.
యుఏఎన్ కార్డు జారీ
అ సంఘటిత రంగ కార్మికులంతా ఆధార్కార్డు, బ్యాంకు అకౌంట్ పుస్తకం, ఫోన్నంబర్లతో స్వయంగా కూడా నమోదు చేసుకోవచ్చు. అయితే వీరంతా స్వయంగా దరఖాస్తులు చేసుకోలేనట్లయితే కామన్ సర్వీస్ సెంటర్కైనా లేదా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ల వద్దనైనా దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. ఇప్పటి వరకు 27,179 మంది కార్మికులు మాత్రమే ఈ శ్రమ్లో నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకోసం సంబంధిత అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ శ్రమ్లో నమోదు చేసుకున్న వారందరితో నమోదు చేసుకోని వారికి అవగాహన కల్పించనున్నారు. కాగా ఇటుకబట్టీల్లో పని చేసే కార్మికులకు మాత్రం ఈ పథకాన్ని తప్పనిసరిగా వర్తింపజేయాలని పేర్కొంటున్నారు. కాగా ఈ శ్రమ్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ యుఎఎన్( యూనివర్సెల్ యాక్సెస్ నంబర్ )ను కేటాయించి ప్రత్యేకంగా ఐడేంటీటీ కార్డును కూడా అందించనున్నారు.
రైతు కూలీలు, ఆటో డ్రైవర్లకు వర్తింపు
ఈ శ్రమ్ ద్వారా ప్రయోజనం పొందేందుకు అన్ని రంగాల్లోని అ సంఘటిత కార్మికులను పరిగణలోకి తీసుకోబోతున్నారు. అసంఘటిత రంగంలో వివిధ రకాల కార్మికులను చేర్చారు. రైతులతో పాటు రైతు కూలీలు, ఆటోడ్రైవర్లు, తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే వారు ఇలాంటి వారందరికీ ఓ వైపు సామాజిక భద్రత కల్పిస్తూ వారికి పలు రకాల ప్రయోజనాలను అందించనున్నారు. కాగా ఇప్పటికే ఈపీఎఫ్, ఈఎస్ఐలలో నమోదై ఉంటే మాత్రం ఈ శ్రమ్లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రస్తుతం కార్మికరంగంలో పనిచేస్తున్న మెజారిటీ కార్మికులకు ఈ శ్రమ్ ద్వారా అనేక రకాల ప్రయోజనాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
అ సంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం అమలు చేయనున్న ఈ శ్రమ్ పోర్ట ల్ నమోదుపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. దీని కోసం కార్మికసంఘాల సహకారాన్ని తీసుకుంటున్నాం. ముఖ్యంగా అన్ని వర్గాల కార్మికులకు ఈ పోర్టల్ నమోదు ద్వారా యుఏఎన్ కార్డును అందించనున్నాం. ఈ కార్డును పొందిన అ సంఘటిత కార్మికులకు యుఏఎన్ కార్డును జారీ చేయనున్నాం. రూ. 2లక్షల వరకు బీమాసౌకర్యం కూడా అందుతుంది.
Updated Date - 2022-01-07T07:11:28+05:30 IST