బాసరలో భక్తుల సమస్యలు పరిష్కరించాల్సిందే..
ABN, First Publish Date - 2022-07-06T07:05:47+05:30
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో భక్తుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ యువకులు మంగళవారం రాస్తారోకో చేశారు.
యువకుల రాస్తారోకో
రెగ్యులర్ ఈవోను నియమించాలని డిమాండ్
బాసర, జూలై 5 : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో భక్తుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ యువకులు మంగళవారం రాస్తారోకో చేశారు. బాసర గ్రామ ఆలయం ఎదుట గల ప్రధాన రహదారిపై సుమారు గంట పాటు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ.. గోదావరి వద్ద భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయం వద్ద కూడా భక్తులకు మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆలయానికి ఆదాయం వస్తున్నా.. భక్తులకు ఎందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. దేవాదాయశాఖ మంత్రి జిల్లాలో ఉన్నప్పటికీ ఎనిమిదేళ్లుగా బాసర ఆలయానికి రెగ్యులర్ ఈవో నియా మకం జరగలేదని మండిపడ్డారు. వెంటనే రెగ్యులర్ ఈవోను నియమించాలని, అలాగే ఆలయంతో పాటు భక్తుల సమస్యలను పరిష్కరించాలని యువకులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఆలయ ఏఈవో సుదర్శన్గౌడ్ యువకులకు సర్దిచెప్పారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
Updated Date - 2022-07-06T07:05:47+05:30 IST