జిల్లాలో కొత్తగా 26 వేల మందికి సామాజిక పెన్షన్లు
ABN, First Publish Date - 2022-08-13T07:43:44+05:30
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి కొత్తగా జిల్లాలో 26 వేల మందికి సామాజిక పెన్షన్లు అర్హులైన వారికి మంజూరు చేస్తుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు.
నిర్మల్ కల్చరల్, ఆగస్టు 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి కొత్తగా జిల్లాలో 26 వేల మందికి సామాజిక పెన్షన్లు అర్హులైన వారికి మంజూరు చేస్తుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో పెద్దఎత్తున మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జడ్పీ చైర్మన్ విజయలక్ష్మితో పాటు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఐకేపీ, డీఆర్డీఏ మహిళా ఉద్యోగులు, బ్రహ్మ కుమారీలు పాల్గొని మంత్రికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ మహిళల సమగ్ర అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఒక పెద్దన్నలాగా అండగా ఉండి వారి సంరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు పెద్ద ఎత్తున పెన్షన్లు మంజూరు చేస్తున్నారని అన్నారు. కిడ్నీవ్యాధితో బాధుపడుతూ డయాలసిస్ చేయించుకునే వారికి పెన్షన్లు ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 57 ఏళ్లు దాటిన అర్హులకు పెన్షన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే లక్ష యాభై వేల మందికి పెన్షన్లు ఇస్తుండగా అదనంగా మరో 26 వేల మందికి పైగా పెన్షన్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణాఽ ద్యక్షుడు మారుగొండ రాము, రైతుసేవా సంఘం అధ్యక్షుడు ధర్మాజీ రాజేందర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-13T07:43:44+05:30 IST