ఎడతెరిపి లేని వర్షం
ABN, First Publish Date - 2022-09-12T03:33:57+05:30
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో శనివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని 17వ వార్డులో గల బృందావనం కాలనీ, సీతారామకాలనీ, నాగదేవతకాలనీ, సూర్యనగర్, వాసు దేవ కాలనీలలో వీధులు నీట మునిగాయి. ఇండ్ల చుట్టు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరద ఉధృతికి సూర్యనగర్లో రోడ్డు కొట్టుకుపోయింది. పాత మంచిర్యాల వద్ద రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది.
తెగిన రహదారులు
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
పొంగిన వాగులు, వంకలు
ఇండ్లకే పరిమితమైన జనం
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద తాకిడి
మంచిర్యాల, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో శనివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని 17వ వార్డులో గల బృందావనం కాలనీ, సీతారామకాలనీ, నాగదేవతకాలనీ, సూర్యనగర్, వాసు దేవ కాలనీలలో వీధులు నీట మునిగాయి. ఇండ్ల చుట్టు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరద ఉధృతికి సూర్యనగర్లో రోడ్డు కొట్టుకుపోయింది. పాత మంచిర్యాల వద్ద రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద కాజ్వే వంతెన మళ్లీ నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలైన ఎల్ఐసీ కాలనీ, రాంనగర్, పాత మంచిర్యాల, ఎన్టీఆర్ నగర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షం ఇదే రీతిలో కొనసాగితే మళ్లీ ముంపు ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లోని ఇండ్లు పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం ఇదే తరహాలో వర్షం కురుస్తుండడంతో రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నూర్, జైపూర్, కోటపల్లి మండలాల్లో పత్తి పంటకు తీరని నష్టం వాటిల్లింది. జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో వందల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది.
జిల్లాలో 64.2 మి.మీల వర్షపాతం నమోదు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జిల్లాలో గరిష్ట స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 64.2 శాతం వర్షం నమోదైంది. గరిష్టంగా వేమనపల్లి మండలంలో 106.5 మిల్లీమీటర్ల వర్షం పడగా జన్నారం మండలంలో అత్యల్పంగా 38.6 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. హాజీపూర్ మండలంలో 105.2 మిల్లీమీటర్లు, మంచిర్యాలలో 97.9 మిల్లీమీటర్లు, తాండూర్ మండలంలో 75.5 మిల్లీమీటర్లు, కాసిపేట మండలంలో 74.1 మిల్లీమీటర్లు, కోటపల్లి మండలంలో 73.5, నెన్నెల మండలంలో 65.6, మందమర్రి మండలంలో 63.7, బెల్లంపల్లి మండలంలో 61.1, జైపూర్ మండలంలో 60.0 మిల్లీమీటర్లు, లక్షెట్టిపేట మండలంలో 56.9, భీమినిలో 55.1, కన్నెపల్లి మండలంలో 49.9, దండేపల్లి మండలంలో 43.6, భీమారం మండలంలో 43.0, నస్పూర్ మున్సిపాలిటీలో 42.0, చెన్నూర్ మండలంలో 40.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఎల్లంపల్లికి భారీగా వరద
గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 3,72,965 క్యూసెక్కుల నీరు చేరుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరవ డంతో 99,840 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 41,183 క్యూసెక్కు లతోపాటు వరద నీరు 2,31,942 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి చేరుతోంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 38 గేట్లు తెలిచి 3,49,506 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 148 మీటర్లకు ప్రస్తుతం 147.44 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు సామర్ధ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.61940 టీఎంసీల నీరు ఉంది.
ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా సింగరేణి సంస్థకు సంబంధించి మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్లలో ఐదు ఓపెన్కాస్టు గనుల్లో బొగ్గు ఉత ్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఓసీపీల్లో 44వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడగా ఐదు ఓసీపీల్లో దాదాపు 3.7 లక్షల క్యూబిక్మీ టర్ల ఓవర్ బర్డెన్ (మట్టి) తొలగింపు పనులు నిలిచిపోయాయి. ఓసీపీల్లో భారీగా నీరు చేరడంతో భారీ యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో తీరని నష్టం వాటిల్లింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
మంచిర్యాల కలెక్టరేట్ : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న కార ణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, చెరువుల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. నీటి ప్రవాహం ఉన్న వంతెనలు, రోడ్ల వద్ద రాకపోకలు నిలిపివేయాలని, లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశారని, పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. అత్యవసర సేవల కోసం 08736-26250501 సంప్రదించాలని పేర్కొన్నారు.
Updated Date - 2022-09-12T03:33:57+05:30 IST