తొలిరోజే 600 కోట్లు
ABN, First Publish Date - 2022-05-24T09:47:55+05:30
స్విట్జర్లాండ్లోని దావో్సలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు తొలిరోజే పెట్టుబడులు వెల్లువెత్తాయి.
- వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
- రూ.500 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ: లూలు గ్రూప్
- తెలంగాణ నుంచి ఐరోపాకు ఆహారోత్పత్తుల ఎగుమతి
- రూ.100 కోట్ల పెట్టుబడులతో ‘స్విస్ రే’ సిద్ధం
- ఆర్ అండ్ డీ కేంద్రంతో ‘కీమో ఫార్మా’ విస్తరణ
- ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్
- భారత లైఫ్ సైన్సెస్ రాజధానిగా గుర్తింపు: కేటీఆర్
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): స్విట్జర్లాండ్లోని దావో్సలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు తొలిరోజే పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్ సోమవారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లూలు గ్రూప్స్ అధినేత యూసుఫ్ అలీ తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించారు. వెంటనే లూలు గ్రూప్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను సిద్ధం చేయించిన మంత్రి కేటీఆర్.. ఆ పత్రాలను యూసుఫ్ అలీకి అందజేశారు. ఈ సందర్భంగా యూసుఫ్ అలీ మాట్లాడుతూ త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణ నుంచి ఐరోపా దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని వివరించారు.
హైదరాబాద్లో నిర్మాణ రంగానికి సంబంధించి.. కమర్షియల్ కాంప్లెక్స్ల ప్రాజెక్టు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామన్నారు. స్పెయిన్కు చెందిన బహుళ జాతి కంపెనీ కీమో ఫార్మా కూడా రూ. 100 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ పరిశోధన-అభివృద్ధి విభాగం డైరెక్టర్ జీన్ డేనియల్ బోనీ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స్విట్జర్లాండ్కు చెందిన బ్యాంకింగ్ ఫైనాన్స్, బీమా రంగానికి చెందిన ‘స్విస్ రే’ హైదరాబాద్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కేటీఆర్తో భేటీ తర్వాత ఆ కంపెనీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేరోనికా స్కాటీ ఈ విషయాన్ని ప్రకటించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న కార్యాలయం ద్వారా తమ డేటా, డిజిటల్ విభాగాలను బలోపేతం చేస్తామని, ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపైన పని చేస్తామని తెలిపారు.
లైఫ్ సైన్సెస్కు గమ్యస్థానం: కేటీఆర్
లైఫ్ సైన్సెస్ రంగానికి హైదరాబాద్ గమ్యంగా మారిందని.. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ నిలిచిందన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయన ‘తెలంగాణ: ఆర్అండ్డీ అండ్ ఇన్నోవేషన్ హాట్స్పాట్ ఆఫ్ ఇండియా’ అంశంపై జరిగిన చర్చలో డాక్టర్ రెడ్డీస్ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.ప్రసాద్ రెడ్డి, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ) ఇండియా ఇన్చార్జి మహమ్మద్ అథర్తో కలిసి పలు అంశాలపై మాట్లాడారు. కరోనా సంక్షోభంలో లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని, ఈ రంగానికి ఊతమిచ్చేందుకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ని ఏర్పాటు చేస్తున్నామని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘భవిష్యత్లో ఈ రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త మందుల ఆవిష్కరణ ప్రయోగశాలను దాటి, డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్ సైన్సెస్ ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. నోవార్టిస్కు చెందిన రెండో అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్లో ఉందని ఆయన గుర్తుచేశారు.
Updated Date - 2022-05-24T09:47:55+05:30 IST