ప్రతి పౌరుడి వద్దకు ‘రైతు డిక్లరేషన్’
ABN, First Publish Date - 2022-05-17T09:10:19+05:30
వరంగల్ సభలో ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ను రాష్ట్రంలోని ప్రతి పౌరుడి వద్దకూ చేర్చే కార్యాచరణ అమలు చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు.
- 21 నుంచి నెల రోజుల కార్యాచరణ అమలు
- ప్రతి గ్రామంలో ముఖ్యనేతల రచ్చబండ
- మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాల నుంచి
- ‘మందు’ బజార్ల వరకు ఫ్లెక్సీలు పెడతాం
- డిక్లరేషన్ గురించి వివరిస్తాం: రేవంత్రెడ్డి
- రాహుల్గాంధీ పాదయాత్ర
- తెలంగాణ నుంచే ప్రారంభించాలి
- టీపీసీసీ విస్తృత కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్, మే 16(ఆంధ్రజ్యోతి): వరంగల్ సభలో ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ను రాష్ట్రంలోని ప్రతి పౌరుడి వద్దకూ చేర్చే కార్యాచరణ అమలు చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు రైతు రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం, వరంగల్ డిక్లరేషన్ను జనాల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు టీపీసీసీ విస్తృత కార్యవర్గం సోమవారం ఇందిరా భవన్లో సమావేశమైంది. రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ కార్యవర్గం, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం, కార్యవర్గ సమావేశంలోనూ రేవంత్రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 400 మంది పార్టీ ముఖ్యనేతలను గుర్తించామని, ప్రతి ముఖ్య నాయకుడూ కనీసంగా 40 చొప్పున గ్రామాల్లో రచ్చబండ సభలను ఏర్పాటు చేసి వరంగల్ రైతు డిక్లరేషన్ను వివరిస్తారని వెల్లడించారు. మొత్తం 12 వేల పైచిలుకు గ్రామాల్లో ఈ సభలు జరుగుతాయన్నారు. మే 21న ప్రతి ముఖ్యనేత ఒక చారిత్రక గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
వరంగల్ జిల్లాలోని ఆచార్య జయశంకర్ సొంత గ్రామంలో జరిగే రచ్చబండ సభలో తాను పాల్గొననున్నట్లు చెప్పారు. అలాగే చాకలి ఐలమ్మ, రాంజీ గోండు తదితర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల గ్రామాలు మొదలుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రముఖుల గ్రామాల వరకు ఆ రోజున రచ్చబండ నిర్వహిస్తామన్నారు. ఈ సభల్లో వరంగల్ రైతు డిక్లరేషన్ను వివరించడంతోపాటుగా రైతుల దుస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు కారణమో కూడా వివరిస్తామన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను ఫ్లెక్సీల రూపంలో రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్లోనూ ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబాన్ని కలిసి డిక్లరేషన్ను వివరిస్తామని అన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలోనూ వరంగల్ రైతు డిక్లరేషన్ను డప్పు చాటింపు వేయిస్తామని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చిన మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాలు, రైతు బజార్లు మొదలుకుని, కేసీఆర్ వచ్చిన తర్వాత తెచ్చిన మందు బజార్ల (వైన్, బెల్టుషాపులు వంటివి) ఎదుట వరంగల్ రైతు డిక్లరేషన్ ఫ్లెక్సీలు పెడతామన్నారు. అక్టోబరు 2 నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ తలపెట్టిన పాదయాత్రను తెలంగాణ నుంచే మొదలు పెట్టాలని కోరుతూ కార్యవర్గ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు రేవంత్రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో చేపట్టిన డిజిటల్ మెంబర్షిప్, వరంగల్ డిక్లరేషన్లకు తెలంగాణ మోడల్గా పార్టీలో పేరొచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించామన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ తిట్ల అజెండా..
ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ను ప్రకటిస్తే అందులో లోపాల గురించి మాట్లాడాల్సిన బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తిట్ల అంశాన్నే అజెండాగా తీసుకున్నారని రేవంత్రెడ్డి అ న్నారు. రైతు డిక్లరేషన్ అన్నదాతల వద్దకు చేరకూడదనే అటు అమిత్షా, ఇటు మంత్రి కేటీఆర్ పరస్పరం తిట్ల అజెండాను తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ అక్రమాల్లో బీజేపీ వాటా పొందుతుంది కాబట్టే గత 8 ఏళ్లుగా ఆయనను రక్షిస్తూ వస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ‘ప్రొటెక్షన్ మనీ’ ఇస్తున్నారు కాబట్టే కేసీఆర్పై ఈగ కూడా వాలకుండా బీజేపీ కాపాడుతోందన్నారు. సొంత పార్టీ నేతలను కూడా వదలని మోదీ, అమిత్షా... కేసీఆర్ను ఎందుకు వదిలి పెడుతున్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు.
Updated Date - 2022-05-17T09:10:19+05:30 IST