Facebook: పోస్టులపై ఇకపై పూర్తి నియంత్రణ మీదే!
ABN, First Publish Date - 2022-05-27T22:49:50+05:30
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా తన యాప్స్ గోప్యతా విధానం (Privacy Policies)లో పలు మార్పులు
న్యూఢిల్లీ: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా తన యాప్స్ గోప్యతా విధానం (Privacy Policies)లో పలు మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా యూజర్లకు తమ పోస్టులపై మరింత నియంత్రణ కల్పించింది. అయితే, ఈ మార్పులు వాట్సాప్కు వర్తించవు. తాజా మార్పుల కారణంగా యూజర్లు తమ పోస్టులను ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎవరు చూడాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ప్రకటనలను కూడా నియంత్రించుకోవచ్చని మెటా పేర్కొంది. పాలసీ అప్డేట్లో భాగంగా యూజర్ల డేటాను సేకరించడం, షేర్ చేయడం వంటివి ఉండవని స్పష్టం చేసింది.
యూజర్లు తమ పోస్టులను ఎవరు చూడాలో సెట్ చేసుకునే కొత్త ఆప్షన్ను ప్రవేశపెట్టిన మెటా.. భవిష్యత్ పోస్టుల కోసం డిఫాల్ట్ ప్రేక్షకులను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు పబ్లిక్కు అందుబాటులో ఉండే పోస్టు చేస్తే, ఆ తర్వాతి పోస్టులు కూడా అలాగే ఉంటాయి. అయితే, మునుపటి సెట్టింగ్స్తో సంబంధం లేకుండా కొత్త సెట్టింగ్స్తో ఆడియన్స్ను ఎంపిక చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఆధారంగా ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే పోస్టులు కనిపిస్తాయి. సెట్టింగ్స్లో ప్రైవసీ ఆప్షన్కు వెళ్లడం ద్వారా ఈ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. కాగా, ఆడియన్స్తోపాటు ప్రకటనలను కూడా మేనేజ్ చేసుకునేలా ప్రైవసీ విధానంలో మెటా మార్పులు చేసింది.
Updated Date - 2022-05-27T22:49:50+05:30 IST