ఈ పతకం దేశం కోసం..
ABN, First Publish Date - 2022-05-28T10:12:18+05:30
మహిళల బాక్సింగ్ వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం నెగ్గి తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన యువ బాక్సర్ నిఖత్ జరీన్కు అభిమానులు ఘన
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మహిళల బాక్సింగ్ వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం నెగ్గి తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన యువ బాక్సర్ నిఖత్ జరీన్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నిఖత్కు తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. నిఖత్తో పాటు ఇటీవల ప్రపంచ జూనియర్ షూటింగ్ వరల్డ్కప్ టీమ్ ఈవెంట్లో రెండు స్వర్ణాలు నెగ్గిన ఇషా సింగ్, భారత ఫుట్బాల్ ప్లేయర్ గగులోతు సౌమ్య కూడా అదే సమయానికి విమానాశ్రయానికి చేరుకోవడంతో కోలాహలం నెలకొంది.
అనంతరం నిఖత్ మాట్లాడుతూ ఈ పతకం దేశం కోసం సాధించానని చెప్పింది. ఇదే స్ఫూర్తితో ఒలింపిక్ మెడల్ కూడా రాష్ట్రానికి తీసుకొస్తానని తెలిపింది. తాను ఈ స్థాయికి రావడానికి ప్రోత్సహించిన సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్గా అవతరించడం చూసి రాష్ట్ర ప్రజలు గర్విస్తున్నారని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిఖత్ సాధించిన స్వర్ణ పతకంతో దేశం మొత్తం పులకించిపోయిందని, రాష్ట్ర యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
Updated Date - 2022-05-28T10:12:18+05:30 IST