‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ మంధాన
ABN, First Publish Date - 2022-01-25T08:54:12+05:30
భారత డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా రెండోసారి ఎంపికైంది.
పురుషుల్లో షహీన్ షా
దుబాయ్: భారత డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా రెండోసారి ఎంపికైంది. 2021లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరచడంతో ఆమెకు ఈ అవార్డు దక్కింది. ‘రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ’గా వ్యవహరించే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం మంధానతోపాటు టామీ బ్యూమంట్ (ఇంగ్లండ్), లిజెల్లీ లీ (సౌతాఫ్రికా), గాబీ లూయిస్ (ఐర్లాండ్) పోటీపడ్డారు. 2018లో స్మృతి ‘ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా తొలిసారి ఎంపికైంది. గతేడాది 22 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మంధాన 38.86 సగటుతో 855 పరుగులు స్కోరు చేసింది. కాగా, మహిళల ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును లిజెల్లీ లీ సొంతం చేసుకొంది. ఇక పురుషుల ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పాకిస్థాన్ పేసర్ షహీన్ షా అఫ్రీది దక్కించుకోగా.. ‘టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా జో రూట్ (ఇంగ్లండ్), ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) ఎంపికయ్యారు. ‘అంపైర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు మరైస్ ఎరా్సమన్ (దక్షిణాఫ్రికా)ను వరించింది.
Updated Date - 2022-01-25T08:54:12+05:30 IST