England-Pakistan match: విశ్వ పోరులో విజేత ఎవరో?
ABN, First Publish Date - 2022-11-13T03:15:04+05:30
తాజా టీ20 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసీజీ)లో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగబోతోంది.
ఇంగ్లండ్ఠ్పాకిస్థాన్ ఫైనల్ నేడు
మ్యాచ్కు వరుణ గండం
టీ20 ప్రపంచకప్
మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
అంచనాలకు అందకుండా.. ఊహించని మలుపులతో సాగిన టీ20 ప్రపంచకప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ర్టేలియా గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా నాకౌట్కే పరిమితమైంది. అయితే ఇంటికి వెళ్తుందనుకున్న పాకిస్థాన్ మాత్రం అనూహ్యంగా టైటిల్ పోరులో నిలిచి ‘1992’ మ్యాజిక్ను పునరావృతం చేయాలనుకుంటోంది. అటు బట్లర్ సేన కలిసికట్టుగా కదం తొక్కుతూ ప్రత్యర్థికి చెక్ పెట్టాలనుకుంటోంది. ఇక సూపర్ బౌలింగ్కు, పటిష్ట బ్యాటింగ్కు జరిగే ఈ సమరంలో పైచేయి ఎవరిదనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే ఇదంతా జరగాలంటే ముందు వరుణుడు కరుణించాల్సి ఉంటుంది..
మెల్బోర్న్: తాజా టీ20 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసీజీ)లో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగబోతోంది. ఇప్పటికే ఇరు జట్ల ఖాతాలో ఒక్కో ప్రపంచకప్ (2009లో పాక్, 2010లో ఇంగ్లండ్) ఉంది. ఇప్పుడు ఎవరు గెలిచినా రెండో కప్ సాధించినట్టవుతుంది. సెమీ్సలో ఇంగ్లండ్ జట్టు భారత్ను పది వికెట్ల తేడాతో చిత్తు చేయగా.. అటు పాక్ జట్టు కివీ్సపై తమ జైత్రయాత్రను కొనసాగించింది. టోర్నీ ఆరంభంలో రెండు వరుస ఓటములతో పాక్ పని అయిపోయినట్టేనని అంతా భావించినా.. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడం వారికి వరంలా మారింది. ఆ ఉత్సాహంలో వరుసగా బంగ్లాదేశ్, కివీ్సలను ఓడించి తుది పోరుకు చేరింది. అటు భారత్ కూడా ఫైనల్ పోరులో లేకపోవడంతో వారిప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా చెలరేగే అవకాశం ఉంది. రెండు జట్ల ఓపెనర్లు సెమీ్సలో అద్భుతంగా ఆడారు. ఈనేపథ్యంలో నేటి మ్యాచ్ అభిమానులకు కనులవిందు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్తో జరిగిన రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచింది. ఓవరాల్గానూ ఈ ఫార్మాట్లో బట్లర్ సేన 18-9తో పాక్పై ఆధిక్యంలో ఉంది. ఈ రెండు జట్లు సూపర్-12లో పసికూనలైన ఐర్లాండ్, జింబాబ్వే జట్ల చేతిలో ఓడడం గమనార్హం.
బౌలింగే బలంగా..
పాక్ యువ పేసర్ షహీన్ షా అఫ్రీది తన చివరి మూడు మ్యాచ్ల్లోనే తొమ్మిది వికెట్లతో ఊపు మీదున్నాడు. వీటిలో ఏ మ్యాచ్లోనూ అతను 30 పరుగులకు మించి ఇవ్వలేదు. అలాగే ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ పది వికెట్లతో సత్తా చాటాడు. ఇక నసీమ్ షా కూడా కట్టుదిట్టమైన బంతులతో పరుగులకు చెక్ పెడుతున్నాడు. మరో పేసర్ హరీస్ రౌఫ్ ఆరంభంలో వికెట్లను తీయగలుగుతున్నాడు. బ్యాటింగ్లో ఓపెనర్లు కెప్టెన్ బాబర్ ఆజమ్, రిజ్వాన్ ఫామ్లోకి రావడం ఈ జట్టుకు అతిపెద్ద ఊరట. ఈ ఓపెనింగ్ జోడీ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమంగా కొనసాగుతోంది. అలాగే మూడో నెంబర్లో 21 ఏళ్ల మహ్మద్ హరీస్ తొలి 10 ఓవర్లలో వేగంగా ఆడుతూ ఒత్తిడి తగ్గిస్తున్నాడు. మిడిలార్డర్లో షాదాబ్, ఇఫ్తికార్, షాన్ మసూద్ ఇప్పటికే అర్ధసెంచరీలతో ఫామ్ కనబరిచారు. ఈ కీలక మ్యాచ్లో వీరంతా కలిసికట్టుగా రాణిస్తే ఇంగ్లండ్కు కష్టాలు తప్పవు.
బ్యాటింగ్ పవర్హౌస్
భారత్తో జరిగిన సెమీ్సలో ఓపెనర్లు హేల్స్, బట్లర్ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే లక్ష్యమెంతైనా ఛేదిస్తారేమో అనిపించింది. టోర్నీ ఆరంభంలో ఈ జోడీ నుంచి మెరుపులు లేకపోయినా సరైన సమయంలో బ్యాట్లు ఝుళిపించింది. ఇక నేడు పాక్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే. ఆల్రౌండర్లు స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్స్టోన్ కూడా మెరుపు వేగంతో ఆడేవారే. తొమ్మిదో నెంబర్ వరకు బ్యాటర్స్ ఉండడం వీరికి కలిసిరానుంది. ఇక బౌలింగ్లోనూ ఫర్వాలేదనిపిస్తోంది. పేసర్ సామ్ కర్రాన్ అఫ్ఘాన్పై ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. నిలకడగా రాణిస్తున్న పేసర్ మార్క్ ఉడ్ ఈ మ్యాచ్కు కూడా సందేహమే. స్పిన్నర్ రషీద్ మాత్రం కేవలం రెండు వికెట్లే తీయగలిగాడు. అయితే మిడిలార్డర్కు ఎక్కువగా మ్యాచ్ ప్రాక్టీస్ లభించలేదు. దీంతో పాక్ బౌలర్లు ఓపెనర్లను త్వరగా అవుట్ చేస్తే వీరి బ్యాటింగ్ నైపుణ్యం తెలిసొస్తుంది.
తుది జట్లు (అంచనా):
పాకిస్థాన్:
రిజ్వాన్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), హరీస్, మసూద్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, వసీమ్ జూనియర్, షహీన్షా, నసీమ్ షా, రౌఫ్.
ఇంగ్లండ్:
బట్లర్ (కెప్టెన్), హేల్స్, సాల్ట్, స్టోక్స్, లివింగ్స్టోన్, మొయిన్ అలీ, బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, జోర్డాన్, ఆదిల్ రషీద్.
ఇంత కాకతాళీయమా ?
1992 వన్డే వరల్డ్కప్.. 2022 టీ20 ప్రపంచక్పలలో పాక్ జట్టు ఒకేమాదిరి ఫైనల్కు చేరిన క్రమాన్ని గమనిస్తే ఓపట్టాన నమ్మబుద్ధి కాదు. ఓసారి ఆ విషయాలను గమనిస్తే.. ఈ రెండు టోర్నీలకు వేదిక ఆస్ర్టేలియానే. అలాగే ఆతిథ్య జట్టు తమ టైటిల్ను కాపాడుకోవడంలో విఫలమైంది. ఇక రెండుసార్లూ పాక్ జట్లు తమ తొలి మ్యాచ్లను మెల్బోర్న్లోనే ఓడాయి. అప్పుడూ ఇప్పుడూ భారత్ చేతిలో ఈ జట్టు ఓడింది. అంతేకాదు.. సెమీ్సకు అదనపు పాయింట్తో చివరి రోజు అర్హత సాధించాయి. గ్రూప్ దశలో చివరి మూడు మ్యాచ్లను గెలిచి ఫైనల్కు చేరింది. సెమీస్లో న్యూజిలాండ్పైనే గెలిచి ఫైనల్కు వచ్చాయి. లెఫ్టామ్ పేసర్లే (వసీం అక్రమ్, షహీన్) జట్టులో ఎక్కువ వికెట్లు తీశారు. ఫైనల్లో ఇంగ్లండ్తోనే..అదీ మెల్బోర్న్లోనే ఫైనల్ ఆడింది. చివరకు వన్డే వరల్డ్కప్ గెలిచింది. మరి నేడు..?
ఫైనల్కు అంపైర్లు వీరే
మ్యాచ్ రెఫరీ:
రంజన్ మదుగల్లె (శ్రీలంక)
ఫీల్డ్ అంపైర్లు:
మారిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా)
కుమార ధర్మసేన (శ్రీలంక)
టీవీ అంపైర్ :
క్రిస్ గఫానీ (న్యూజిలాండ్)
ఫోర్త్ అంపైర్:
పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా)
Updated Date - 2022-11-13T08:04:31+05:30 IST