రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల తన ట్వీట్లో ప్రస్తావించిన బిష్నీదేవి ఎవరు? ఆమె ఎంతటి ఘనత సాధించారో తెలిస్తే...
ABN, First Publish Date - 2022-12-28T11:40:53+05:30
ఇటీవల మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ను సందర్శించిన నేపధ్యంలో ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఉత్తరాఖండ్ మొదటి మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలి గురించి ప్రస్తావించారు.
ఇటీవల మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ను సందర్శించిన నేపధ్యంలో ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఉత్తరాఖండ్ మొదటి మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలి గురించి ప్రస్తావించారు. రాష్ట్రపతి తన ట్వీట్లో 'ఆమె సాధారణ కుటుంబానికి చెందినది. అంతంతమాత్రమే చదువుకున్న మహిళ. అయితే ఆమె భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన సహకారం అసాధారణమైనదని పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో స్వాతంత్ర్య ఉద్యమంలో ఉత్తరాఖండ్కు చెందిన మొదటి మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు అందించిన సహకారం జాతీయ స్థాయిలో మరోమారు వెలుగులోకి వచ్చింది. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసి, ఇలాంటి అనామకులుగా మిగిలిపోయినవారు ఎందరో నేటికీ ఉన్నారు. ఉత్తరాఖండ్లోని అల్మోరాకు చెందిన బిష్నీ దేవి సాహ్ ఆ మహనీయులలో ఒకరు.
స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లిన ఉత్తరాఖండ్ తొలి మహిళా ఉద్యమకారిణి ఆమెనే అని ద్రౌపది ముర్ము తన ట్వీట్లో పేర్కొన్నారు. స్థానిక ప్రజలు బిష్నీ దేవి సాహ్ను ప్రేమతో బిషు బుబు అని పిలిచేవారు. బిష్నీ దేవి 1902 అక్టోబర్ 12న బాగేశ్వర్లో జన్మించారు. అక్కడే నాలుగో తరగతి వరకు చదువుకున్నారు. 13 సంవత్సరాల వయస్సులో బిష్నీ దేవికి అల్మోరాకు చెందిన ఉపాధ్యాయుడు రాంలాల్తో వివాహం జరిగింది. 16 ఏళ్ల వయసులో భర్త చనిపోవడంతో తల్లిదండ్రులు, అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. భర్త మరణం తర్వాత, బిష్నీ దేవి తన సోదరునితో కలిసి అల్మోరాలో ఉండసాగింది. క్రమంగా బిష్నీ దేవి స్వాతంత్ర్య ఉద్యమాల వైపు మొగ్గు చూపసాగారు.
1921లో బిష్నీ దేవి జాతీయ ఉద్యమంలోకి దూకారు. క్రమంగా జానపదాలతో కూడిన దేశభక్తి గీతాలను పాడటం ప్రారంభించారు బిష్నీ దేవి. ఈ నేపధ్యంలో ఆమె 1930లో మొదటిసారి అరెస్టు అయ్యారు. ఆమె అల్మోరా జైలు నుండి విడుదలైన తర్వాత గ్రామాలలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. 1932లో బిష్నీ దేవి మళ్లీ అరెస్టయ్యారు. పదే పదే అరెస్టులు చేసినా ఆమె ధైర్యం ఏ మాత్రం తగ్గలేదు. 1933 మే 29న ఆమె విడుదలయ్యారు. 1945లో జవహర్లాల్ నెహ్రూ అల్మోరా జైలు నుండి విడుదలైనప్పుడు, బిష్నీ దేవి ఆయనను రిసీవ్ చేసుకోవడానికి జైలు ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి ఆయనను స్వాగతించారు. ఆమె నిరంతరం స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ప్రజలంతా ప్రేమగా పిలుచుకునే బిషు బుబు అంటే బిష్నీ దేవి సాహ్ 1974లో తన 93 సంవత్సరాల వయసులో మరణించారు. ఆ సమయంలో వేలాది మంది ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు.
Updated Date - 2022-12-28T11:40:55+05:30 IST