‘Bharat Gaurav’ Train: ఇకపై రైళ్లలోనూ యోగా సాధన చేయచ్చు.. ఈ ట్రైన్లోనే..!
ABN, First Publish Date - 2022-06-13T02:00:02+05:30
దేశంలో పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా భారత్ గౌరవ్ రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. దేశంలోని..
దేశంలో పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా భారత్ గౌరవ్ రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. దేశంలోని వారసత్వ, చారిత్రాక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు రైల్వే శాఖ ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 21 న మొదటి రైలు ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ఈ భారత్ గౌరవ్ రైలు.. దేశంలోని పలు పర్యాటక కేంద్రాలను చుట్టి రానుంది. మొత్తం ఎనిమిది రాష్ట్రాలు, 12 పట్టణాల గుండా ప్రయాణించనుంది. మొత్తం 18 రోజులపాటు ఈ జర్నీ సాగనుంది.
600 సీటింగ్ కెపాసిటీతో నడిచే ఈ రైలులో ఇప్పటికే 450 సీట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఒక్కో టికెట్ ధర 65 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఈ రైలులో చాలా ప్రత్యేకతలు ఉండటం విశేషం.. ఇందులో యోగా సాధన కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. రైలులోని రెండు కోచ్లను యోగా ప్రాక్టీస్ కోసమే కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ రెండు బోగీల్లో యోగా సాధన కోసం సరైన వెసులుబాట్లు, మ్యాట్లు, ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యోగసనాలు వేయించేందుకు ఓ ట్రైనీ కూడా అందుబాటులో ఉంటారు. యోగాపై ఆసక్తి ఉన్నవారు. రోజూ చేసేవారు రైలులోనే చేసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. భారత్ గౌరవ్ రైలులో ప్రయాణించాలంటే కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.
Updated Date - 2022-06-13T02:00:02+05:30 IST