భార్యను, కూతురిని నిద్రలోనే చంపేశాడు.. అలా ఎందుకు చేశాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ABN, First Publish Date - 2022-02-08T18:09:41+05:30
మంచం మీద నిద్రపోతున్న కూతురు, భార్యని అర్ధరాత్రి గొంతు కోసి చంపేశాడు.. ఆ రాత్రంతా వారి పక్కనే పడుక్కున్నాడు
మంచం మీద నిద్రపోతున్న కూతురు, భార్యని అర్ధరాత్రి గొంతు కోసి చంపేశాడు.. ఆ రాత్రంతా వారి పక్కనే పడుక్కున్నాడు.. తర్వాతి రోజు ఉదయం తన పెద్ద కూతురికి ఫోన్ చేసి తను చేసిన పని గురించి చెప్పాడు.. పోలీసులకు ఫిర్యాదు చేయమని కోరాడు.. పోలీసులు రాగానే వారికి జరిగింది చెప్పి లొంగిపోయాడు.. మహానగరం ముంబైలో ఈ ఘటన జరిగింది. అంధేరీ ప్రాంతంలో మాజీ ఆర్మీ ఆఫీసర్ పురుషోత్తమ్ సింగ్ (89) తన భార్య జస్భీర్ కౌర్ (81), కూతురు కమలాజిత్ కౌర్తో కలిసి నివసిస్తున్నాడు.
చాలా సంవత్సరాలుగా పురుషోత్తమ్ సింగ్ భార్య, దివ్యాంగురాలైన కూతురు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇద్దరూ మంచాలకే పరిమితమయ్యారు. వారి కష్టాలను చూసి బాధపడుతూనే పురుషోత్తమ్ వారిద్దరికీ సేవ చేశాడు. ఎన్ని రోజులైనా ఇద్దరూ అలా మంచాల పైనే ఉండాలనే బాధ ఒకవైపు, 89 సంవత్సరాలకు చేరువైన తను చనిపోతే వారిని చూసే దిక్కు ఉండదనే వేదన మరోవైపు. ఈ నేపథ్యంలో పురుషోత్తమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వారికి బాధల నుంచి విముక్తి ప్రసాదించాలనుకున్నాడు.
ఆదివారం రాత్రి భార్య, కూతుర్ని చంపేశాడు. ఆ తర్వాత రాత్రి అక్కడే గడిపి సోమవారం ఉదయం తన పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి హత్యల గురించి తెలియజేశాడు. పోలీసులకు సమాచారం అందించమన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు విషయమంతా చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పురుషోత్తమ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Updated Date - 2022-02-08T18:09:41+05:30 IST