మన దేశంలోని ఆ నది పర్వతాల నడుమ పుట్టినా సముద్రంలో కలవదు.. కారణమిదే!
ABN, First Publish Date - 2022-02-20T15:04:10+05:30
భారతదేశంలో చిన్న, పెద్ద నదులను పరిగణలోకి తీసుకుంటే..
భారతదేశంలో చిన్న, పెద్ద నదులను పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా 400కు పైగానే ఉన్నాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా, నదులు పర్వతాల నుండి ఉద్భవించి చివరికి సముద్రంలో కలుస్తాయి. ఉదాహరణకు గంగోత్రి నుండి ఉద్భవించిన గంగా నది బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే పర్వతాలలో ఉద్భవించినా ఏ సముద్రంలోనూ కలవని ఒక నది మన దేశంలో ఉంది. విచిత్రమనిపించినా ఇది నిజం. రాజస్థాన్లోని అజ్మీర్లో పుట్టిన లూని నది ఏ సముద్రంలో సంగమించని ఏకైక నదిగా పేరొందింది. లూని నది అజ్మీర్లో సుమారు 772 మీటర్ల ఎత్తులో ఉన్న ఆరావళి శ్రేణిలోని నాగ్ కొండలలో ఉద్భవించింది. 495 కి.మీ పొడవున్న ఈ నది ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ప్రధాన నది. ఇది గుజరాత్ వరకూ ప్రవహిస్తుంది. అధిక ప్రాంతాలకు సాగునీరు అందిస్తోంది. రాజస్థాన్లోని ఈ నది మొత్తం పొడవు 330 కి.మీ కాగా, మిగిలిన నది గుజరాత్లో ప్రవహిస్తుంది.
లూని నది రాజస్థాన్లోని అజ్మీర్ నుండి పుట్టి, నాగౌర్, జోధ్పూర్, పాలి, బార్మర్, జలోర్ మీదుగా గుజరాత్లోని కచ్కు చేరుకుని రాన్ ఆఫ్ కచ్లో కలుస్తుంది. లూని నది చాలా ప్రత్యేకమైనది. అజ్మీర్ నుండి బార్మర్ వరకు ఉన్న ఈ నది నీరు తీపిగా ఉంటుంది. ఆ తరువాత ఉప్పగా మారుతుంది. దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణం ఏమిటంటే.. ఈ నది రాజస్థాన్ ఎడారి గుండా వెళుతున్నప్పుడు, దానిలోని ఉప్పు కణాలు నదిలో కలిసిపోతాయి. దీంతో నీరు లవణంగా మారుతుంది. లూని నదికి దాని స్వభావం కారణంగా ఈ పేరు వచ్చింది. లూని అనే పేరు సంస్కృత పదం లవణగిరి నుండి వచ్చింది. లవణగిరి అంటే ఉప్పగా ఉండే నది అని అర్థం. లూని నదికి అనేక ఉపనదులు కూడా ఉన్నాయి, వీటిలో మిత్రి, లీలాది, జవాయి, సుక్రి, బండి, ఖరీ మరియు జోజారి ఉన్నాయి.
Updated Date - 2022-02-20T15:04:10+05:30 IST