Kaun Banega Crorepati 14: రూ.7.5కోట్ల ప్రశ్న.. కవితా జవాబు చెప్పలేకపోయారు.. మీరు చెప్పగలరా?
ABN, First Publish Date - 2022-09-21T18:53:07+05:30
బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్ చేస్తున్న ‘కౌన్బనేగా కరోడ్పతి-14’ (Kaun Banega Crorepati 14)లో పాల్గొన్న ఓ సాధారణ గృహిణి కోటి రూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్ చేస్తున్న ‘కౌన్బనేగా కరోడ్పతి-14’ (Kaun Banega Crorepati 14)లో పాల్గొన్న ఓ సాధారణ గృహిణి కోటి రూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇంటర్ వరకే చదువుకున్న ఆమె.. ఈ సీజన్లో రూ. కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. ఆమెనే మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన కవితా చావ్లా(Kavita Chawla). అయితే, కవితా తృటిలో రూ.7.5 కోట్లు గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నారు. చివరి ప్రశ్నకు సమాధానం చెప్పి ఉంటే.. రూ. 7.5కోట్లు ఆమె సొంతం అయ్యేవి. కానీ, ఆ ప్రశ్నకు సమాధానం తెలియదంటూ ఆమె క్విట్ అయ్యారు. ఇంతకు ఆ ప్రశ్న ఏంటి? దానికి కవితా చెప్పిన సమాధానం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత చివరి ప్రశ్నగా (రూ.7.5కోట్లు) కవితాకు అమితాబ్..'అరంగేట్ర ఫస్ట్క్లాస్ మ్యాచ్లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్గా నిలిచిన గుండప్ప విశ్వనాథ్ (Gundappa Vishwanath) ఈ ఫీట్ను ఏ జట్టుపై సాధించారు' అనేది ప్రశ్న. దీనికి సమాధానంగా నాలుగు ఆప్షన్లు ఇవే.. A) సర్వీసెస్, B) ఆంధ్రా, C) మహారాష్ట్ర, D) సౌరాష్ట్ర. అయితే, కవితా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. అప్పటికే ఆమె లైఫ్లైన్స్ కూడా అయిపోయాయి. దాంతో క్విట్ అవుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఆమెను వెళ్లేముందు ఏదైనా ఒక సమాధానం గెస్ చేయాల్సిందిగా బిగ్బీ అడిగారు. దాంతో కవితా ఆప్షన్ 'A' ను లాక్ చేశారు. కానీ, అది తప్పు సమాధానం. దీనికి సరైన జవాబు ఆప్షన్ 'B'.
ఇదిలాఉంటే.. కోటి రూపాయలు గెలుచుకోవడం పట్ల కవితా తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. కరోడ్పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కొల్హాపూర్ మహిళను కావాలని అనుకున్నానని, తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. 'ఓ రికార్డు సృష్టించా' అని సంబరపడ్డారు. కోటిరూపాయలు గెలుచుకోవడం అనేది కేక్పై ఉన్న చెర్రీ లాంటిదని కవితా అన్నారు.
Updated Date - 2022-09-21T18:53:07+05:30 IST