చాణక్య నీతి: ఈ మూడు విషయాల్లో సిగ్గుపడితే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే!
ABN, First Publish Date - 2022-08-11T12:54:41+05:30
ఆచార్య చాణక్య రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రాలలో...
ఆచార్య చాణక్య రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రాలలో పండితునిగా పేరుగాంచాడు. తన జీవన విధానాలతో ఒక సాధారణ బాల చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిగా చేశాడు. తానే అతనికి మంత్రిగా మారాడు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సులభ మార్గాలను అందించాడు. ఈ విధానాలను అవలంబించడం ద్వారా చాలామంది సన్మార్గంలో పయనిస్తూ తమ జీవితాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి మూడు విషయాల్లో సిగ్గుపడితే తాను కూర్చున్న కొమ్మను తానే నరుకున్నట్లవుతుందని తెలిపాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గురువు నుండి జ్ఞానాన్ని స్వీకరించే విషయంలో...
ఆచార్య చాణక్యుడు చెప్పేదేమిటంటే ఒక వ్యక్తి తన గురువు నుండి జ్ఞానాన్ని తీసుకునే విషయంలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎవరైతే ఎటువంటి సందేహాలు లేకుండా గురువు నుండి జ్ఞానాన్ని పొందుతారో, వారు జ్ఞానవంతులు అవుతారు. అదే సమయంలో మనస్సులో తలెత్తే ప్రశ్నలకు గురువు నుండి సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించని వారి జ్ఞానం అసంపూర్ణంగా ఉండి, భవిష్యత్తులో వారు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని చాణక్య హెచ్చరించారు.
డబ్బు అడిగే విషయంలో...
డబ్బు అడిగే విషయంలో ఎప్పుడూ వెనుకాడకూడదని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. డబ్బుకు సంబంధించిన పనులలో వెనుకాడేవారు ధన నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరినైనా రుణం కోరేముందు ఎప్పుడూ వెనుకాడకూడదు. మరోవైపు మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే, అందరితో స్పష్టమైన వ్యవహారాలను కొనసాగించాలి. లేదంటే విలువైన డబ్బును కోల్పోయే అవకాశముంది.
సాధారణ దుస్తులు ధరించే విషయంలో
చాణక్య నీతి ప్రకారం మనిషి వ్యక్తిత్వం అతను ధరించిన దుస్తులను బట్టి ఉండదు. అవతలివారి కోసం చాలామంది ఆడంబరమైన దుస్తులు ధరిస్తారు. అయితే సాధారణ దుస్తులు ధరించడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. సాధారణ దుస్తులు వేసుకున్నా, ఖరీదైనవి వేసుకున్నా ఒకటేనని అంటాడు ఆచార్య చాణక్య.
Updated Date - 2022-08-11T12:54:41+05:30 IST