UK museum: 14వ శతాబ్ధపు ఖడ్గం సహా 7 ప్రాచీన కళాఖండాలను భారత్కు అప్పగించిన బ్రిటన్
ABN, First Publish Date - 2022-08-21T18:59:01+05:30
ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో మగ్గుతున్న అపురూప భారత సంపద తిరిగి స్వదేశానికి చేరుకుంటోంది. తాజాగా ఏడు ప్రాచీన కళాఖండాలను గ్లాస్గో కేంద్రంగా పనిచేసే యూకే మ్యూజియం ఇండియాకు అప్పగించింది. ఇందులో 14వ శతాబ్ధం నాటి ఇండో పర్షియన్ ఖడ్గం (Indo Persian sword) కూడా ఉంది.
గ్లాస్గో: ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో మగ్గుతున్న అపురూప భారత సంపద తిరిగి స్వదేశానికి చేరుకుంటోంది. తాజాగా ఏడు ప్రాచీన కళాఖండాలను గ్లాస్గో కేంద్రంగా పనిచేసే యూకే మ్యూజియం ఇండియాకు అప్పగించింది. ఇందులో 14వ శతాబ్ధం నాటి ఇండో పర్షియన్ ఖడ్గం (Indo Persian sword) కూడా ఉంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వంతో చారిత్రాత్మక ఒప్పందంపై బ్రిటన్ మ్యూజియం సంతకం చేసింది. భారత హై కమిషన్ అధికారుల సమక్షంలో కెల్వింగ్రోవ్ ఆర్ట్ గ్యాలరీ అండ్ మ్యూజియం ( Kelvingrove Art Gallery and Museum)లో శుక్రవారం ఈ ఒప్పందం జరిగింది.
గ్లాస్గో సిటీ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఏప్రిల్లో క్రాస్ పార్టీ వర్కింగ్ గ్రూప్ ఫర్ రీపాట్రియేషన్ అండ్ స్ఫోలియేషన్ ద్వారా 51 వస్తువులను భారత్, నైజీరియా, చెయేన్ నది, పైన్ రిడ్జ్ లకోటా సియోక్స్ తెగలకు తిరిగి ఇవ్వడానికి చేసిన సిఫార్సును ఆమోదించింది. దీనిలో భాగంగానే తాజాగా ఏడు ప్రాచీన కళాఖండాలను భారత్కు అప్పగించింది. ఈ ఒప్పందంపై సంతకం చేయడం పట్ల భారత తాత్కాలిక హైకమీషనర్ సుజిత్ హోష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కళాఖండాలు భారతదేశ వారసత్వంలో అంతర్భాగమని, వీటిని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తిరిగి పంపిస్తామని ఆయన తెలిపారు. దీనిని సుసాధ్యం చేసిన గ్లాస్గో లైఫ్, గ్లాస్గో సిటీ కౌన్సిల్కు సుజిత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Updated Date - 2022-08-21T18:59:01+05:30 IST