3 నెలలుగా గల్ఫ్లోనే తెలుగు ప్రవాసీ మృతదేహం.. అక్కడి కఠిన నిబంధనలే కారణం!
ABN, First Publish Date - 2022-06-14T12:54:35+05:30
గల్ఫ్ దేశాల్లోని కొన్ని కఠినమైన నిబంధనలు ప్రవాస భారతీయ కార్మికుల పాలిట శాపంలా మారుతున్నాయి. చనిపోయిన వారి మృతదేహాలను స్వదేశాలకు తరలించాలన్నా.. కఠిన నిబంధనల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. పోలీసు కేసు ఉందన్న కారణంతో.. గల్ఫ్లో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ కార్మికుడి మృతదేహం 3 నెలలుగా అక్కడే ఉంది.
ఓ శవమా.. నిర్దోషి అని నిరూపించుకో!
తప్పుడు ఫిర్యాదుతో జగిత్యాల వాసిపై కేసు
స్వదేశానికి వెళ్లాలంటే నిబంధనలు అడ్డు
జీవితంపై విరక్తి చెంది అక్కడే ఆత్మహత్య
గల్ఫ్ దేశాల్లోని కొన్ని కఠినమైన నిబంధనలు ప్రవాస భారతీయ కార్మికుల పాలిట శాపంలా మారుతున్నాయి. చనిపోయిన వారి మృతదేహాలను స్వదేశాలకు తరలించాలన్నా.. కఠిన నిబంధనల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. పోలీసు కేసు ఉందన్న కారణంతో.. గల్ఫ్లో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ కార్మికుడి మృతదేహం 3 నెలలుగా అక్కడే ఉంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపురం గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీనివాస్ రియాధ్లో పనిచేసేవాడు. యజమానితో పని, వేతనం విషయంలో వివాదం రావడంతో మరో చోట పనిలో చేరాడు. కరోనా అనంతరం ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో స్వదేశానికి వెళ్లేందుకు యత్నించాడు.
శ్రీనివాస్ వల్ల తనకు నష్టం జరిగిందంటూ పాత యజమాని అతడిపై తప్పుడు కేసు పెట్టాడు. మరోవైపు ఎలాగైనా స్వదేశానికి చేరుకోవాలనే తపనతో శ్రీనివాస్ రియాధ్ నుండి 400 కి.మీ దూరంలోని దమ్మాం ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుండి మాతృభూమికి చేరుకోవడానికి ప్రయత్నించాడు. వీలుకాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మార్చి 20న రాత్రి భార్యతో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి శ్రీనివాస్ మృతదేహం గల్ఫ్లోనే ఉంది. మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి అవసరమైన నిధులను కూడ భారతీయ ఎంబసీ మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం శ్రీనివాస్ మృతదేహాన్ని స్వదేశానికి పంపించాలంటే ముందుగా అతడి వీసా రద్దు చేయాలి. అలా జరగాలంటే అతడిపై ఉన్న పోలీసు కేసును పరిష్కరించి, మూసివేయాలి. చనిపోయిన శ్రీనివాస్ కేసు విషయంలో ఏ రకంగా వివరణ ఇస్తాడు, ఈ కేసును ఎలా ముగిస్తారని అతడి మిత్రులు సతమతమవుతున్నారు. భారతీయ ఎంబసీ అధికారులు పోలీసుల నుండి నిరభ్యంతర ధ్రువపత్రాన్ని పొంది, కేసును మూయించడానికి ప్రయత్నిస్తున్నారు.
Updated Date - 2022-06-14T12:54:35+05:30 IST